ఈ నెల 05న పరెడ్ గ్రౌండ్ లో నిర్వహించే సభను విజయవంతం చేయండి : ఈటల

-

ఈ నెల 5న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సభ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగబోతోందని.. దానిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేకనే రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని.. బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం పదవికి ఎసరు వస్తుందనే మల్కాజ్ గిరిలో ఎలా అయినా గెలవాలని చూస్తున్నారు.

భారతీయ జనతాపార్టీ మిగిలిన పార్టీలన్నింటి కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. అమిత్‌షా తెలంగాణ ప్రచారానికి వచ్చినప్పుడు 12 సీట్లలో గెలుస్తున్నామని సర్వేల ద్వారా తెలిసిందని చెప్పారు. ప్రధాని మోదీ మల్కాజ్‌గిరిలో రోడ్‌షో ర్యాలీని చూసి మంత్రముగ్దులయిపోయారు. మల్కాజ్‌గిరి ప్రజల ఆదరాభిమానాలకు ఎంతో సంతోషించారు. ఈసారి బీజేపీ పార్లమెంట్ ఎన్నికలలో విజయకేతనం ఎగురవేయడం ఖాయమని ప్రకటించారు.

అమిత్ షా సభ లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజక వర్గం లోని ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి, మేడ్చల్, కంటోన్మెంట్, కూకట్ పల్లి నియోజక వర్గాలలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నారు. మేమందరం గత రెండు నెలలుగా అంటే 60 రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నాము. ప్రజలందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు మూడవసారి ముచ్చటగా మోదీనే ప్రధాని కావాలని కోరుతున్నారు. అబ్‌కీ బార్ చార్ సౌ పార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ ప్రజలలో నుండి నినాదాలు వస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఇతర పార్టీ నాయకులకు వెలకడుతూ లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తోంది. అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. రేవంత్ రెడ్డి 6 ఉచిత గ్యారెంటీలు, 66 హామీలు అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించాడు. కానీ ఉచిత బస్సు తప్ప.. మరే హామీని నెరవేర్చలేకపోయారు.

ప్రతీ మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలిస్తామని, వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్లు పెంచుతామని ప్రజలను ఆశ పెట్టారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలైనా ఏదీ నెరవేర్చలేదు. ఆడపిల్ల వివాహానికి కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయలతో పాటు, తులం బంగారం ఇస్తానని కూడా చెప్పాడు. అది కూడా ఒక్కరికి కూడా ఇంకా చేరలేదు. రైతులకు 15 వేలు రైతుబంధు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ ఎవ్వరికీ రాలేదు. గతంలో కేసీఆర్ ఇచ్చిన 10 వేల రూపాయలు కూడా ఇవ్వడం లేదు

ఈ పథకాలను మరిపించడానికి రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నాడు కాబట్టి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయితే తన పరువు ఎక్కడ పోతుందో, తన ముఖ్యమంత్రి పదవి నిలబడుతుందో లేదో అనే బెంగతో ప్రజలను ఆకర్షించడానికి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దావత్‌లు ఇచ్చి, డబ్బులిచ్చి ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నాడు. మల్కాజ్‌గిరి చైతన్యవంతమైన నియోజకవర్గం. ఇక్కడ ప్రజలు డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగరు.

ఈ నియోజక వర్గంలో ఎక్కడికి పోయినా బీజేపీనే గెలుస్తుంది, ఈటల రాజేందర్ గెలుస్తారు అని చెప్తున్నారు. మీకు అడ్వాన్స్‌డ్ కంగ్రాట్యులేషన్స్ అని చెప్తున్నారు. కాంగ్రెస్ ఆటలు ఇక్కడ సాగవు. ఆదివారం జరగబోయే అమిత్ షా సభకు ఈ పార్లమెంట్ పరిధిలోని ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గం నుండి ప్రజలు వేలాదిగా తరలివచ్చి సాయంత్రం 5 గంటలకు సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీతో రాలేదు. స్వాతంత్య్రం రాకముందే సాహు మహరాజ్ కల్పించారు. సైమన్ కమీషన్ 1927లో పేదలకు, అణచివేతకు గురైన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలని రిపోర్టు తయారు చేసింది. అప్పటి కాంగ్రెస్ పార్టీ ఈ రిపోర్టును పట్టించుకోలేదు. కానీ అంబేద్కర్‌గారు మాత్రం లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులో పాల్గొని, ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఈ విషయం గురించి ఎన్నడూ మాట్లాడలేదు. రాజ్యాంగంలో కూడా అంబేద్కర్ గారే రిజర్వేషన్ల అంశాన్ని పొందుపరిచారు. అప్పట్లో వీపీ సింగ్ రిజర్వేషన్ల గురించి పార్లమెంట్‌లో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ గాంధీ ఈ రోజుల్లో కూడ ఎందుకు కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రశ్నించారు. గిరిజన మంత్రిత్వ శాఖను ప్రవేశ పెట్టిందే వాజపేయి గారు. గుజరాత్‌లో 30 ఏళ్లుగా పరిపాలిస్తున్న బీజేపీ ఏనాడూ రిజర్వేషన్లు రద్దు చేయలేదు. బీసీలకు మొట్టమొదటిగా చట్టబద్దత కల్పించింది నరేంద్రమోదీ గారే. కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు మద్దతుగా లేదు.వారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది వెనుకబడిన తరగతుల వారికి మంత్రిత్వ శాఖలు ఇచ్చారు.

ప్రధాని మోదీ మంత్రివర్గంలో 27మంది ఓబీసీ, 12 ఎస్సీ, 8 మంది ట్రైబల్ మంత్రులు ఉన్నారు. ఇంత మొత్తంలో అణగారిన వర్గాలకు మంత్రిపదవులిచ్చిన ప్రభుత్వం నరేంద్రమోదీదే. గతంలో ఎప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత స్థాయిలో మంత్రి పదవులు లేవు. మోదీ ప్రధాని అయిన తర్వాత అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని దళితులకు ఇచ్చారు. ఆదివాసీ మహిళ అయిన ద్రౌపదిముర్మును రాష్ట్రపతిని చేశారు. గతంలో వాజపేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు మైనారిటీకి చెందిన అబ్దుల్ కలామ్ గారిని రాష్ట్రపతి పదవి ఇచ్చి గౌరవించారు. ఈ చరిత్ర అంతా మరిచిపోయి కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అంతే కాదు అగ్రవర్ణాల పేదలకు కూడా రాజ్యాంగ సవరణ చేసి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ప్రవేశపెట్టిన ఘనత నరేంద్రమోదీదే

దేశంలో అసమానతలు పోవాలని, అన్ని కులాలు, వర్గాల వారికి సముచిత న్యాయం జరగాలని సబ్ కా సాథ్ సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ సబ్ కా ప్రయాస్ అనే నినాదాన్ని ప్రోత్సహిస్తున్నారు నరేంద్రమోదీ. 1977 తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు తప్ప పటిష్టమైన ప్రభుత్వం లేదు. బీజేపీపై గుడ్డి ద్వేషంతో మాట్లాడుతున్న మాటలే కానీ, కాంగ్రెస్ చెప్పే మాటలలో ఏమాత్రం నిజం లేదు. బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదు. 106 రాజ్యాంగ సవరణలు చేసింది కాంగ్రెస్ పార్టీనే. కాలానుగుణంగా ప్రజల అవసరాలను బట్టి సవరణలు చేయడం తప్ప మార్చడం ఎంతమాత్రం కుదరదని దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీకి తెలియకపోవడం విచిత్రంగా ఉంది. ప్రజలకిచ్చిన వాగ్దానాలు రేవంత్ రెడ్డి అమలుచేస్తారు అని భావించాం కానీ, ఏ ఒక్కటీ అమలు చేయలేదు. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లయ్యిందని బాధ పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news