మూడు రోజుల్లోగా రైతుల బ్యాంక్ ఖాతాలో నగదు

-

తెలంగాణలో వరి కోతలు ప్రారంభంకావడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వరి ధాన్యం భారీగా చేరుకొంటుంది. ఈ నేపథ్యంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అకాలవర్షాలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు వెంటనే అన్లోడింగ్ చేసుకుని వివరాలను ఆన్లైన్లోని నమోదు చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు ధాన్యం అమ్ముకోవడానికి వేచిచూసే పరిస్థితి లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరపాలని సూచించారు. లారీలు, హమాలీల కొరత లేకుండా కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగేలా ధాన్యం కొనుగోళ్లకు సంబంధం ఉన్న వ్యవసాయ, రెవెన్యూ, రవాణా, సహకార తదితర విభాగాలతో క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలని పౌరసరఫరాల అధికారులను ఆదేశించారు.

గతంలో రైస్ మిల్లుల్లో తాలు పేరుతో తరుగు తీసిన సంఘటనలు వెలుగు చూడడంతో ఈ సారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందే అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించిన తర్వాత అక్కడ తాలు పేరుతో తరుగు తీయడం చట్ట విరుద్ధమని, ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు నష్టం జరగకుండా చూడాలని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. అకాల వర్షాల వల్ల కేంద్రాల్లో ధాన్యం తడవకుండా అవసరమైన టార్ఫలిన్లు రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. ఈ విషయంలో మార్కెటింగ్ శాఖతో సమస్వయం చేసుకోవాలన్నారు.

ఈ యాసంగిలో ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7,114 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రతిపాదించగా ఇప్పటి వరకు 5,884 కేంద్రాలను ప్రారంభించినట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోగా రైతుల బ్యాంక్ ఖాతాలో నగదు జమచేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం దించుకున్న వెంటనే మిల్లర్లు ధాన్యం వివరాలను తక్షణం ఆన్లైన్ లో నమోదు చేస్తేనే రైతులకు అనుకున్న విధంగా చెల్లింపులు జరుపగలమని ఈ విషయంలో అదనపు కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news