టీచర్ల బదిలీలకు బ్రేక్.. ఈనెల 19 వరకు ప్రక్రియ నిలిపివేయాలని హైకోర్టు స్టే

-

తెలంగాణలో టీచర్ల బదిలీలు, పదోన్నతులు ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా లేవు. ఈ ప్రక్రియ ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. టీచర్ల బదిలీలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులు నిర్వహించకుండా బదిలీల కౌన్సెలింగ్‌ చేపట్టడంపై ఈనెల 19వ తేదీలోగా కౌంటర్లు దాఖలు చేయాలని.. అప్పటివరకు బదిలీలు చేపట్టరాదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

పరిమితికి మించి రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేయడం, పదోన్నతులు పూర్తికాకుండానే బదిలీల కౌన్సెలింగ్‌ చేపట్టడాన్ని సవాలు చేస్తూ అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ పలువురు టీచర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ల న్యాయవాది దొంతినేని బాలకిషన్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఇతర జిల్లాల నుంచి రంగారెడ్డి జిల్లాకు స్కూలు అసిస్టెంట్‌లు, ఎస్జీటీలు పరిమితికి మించి రావడం, వారి నియామక తేదీ నుంచి సీనియారిటీని తీసుకోవడంతో బదిలీల కౌన్సెలింగ్‌ జాబితాలో వారే ముందు ఉంటుండం వల్ల స్థానిక జిల్లా ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని కోర్టుకు తెలిపారు. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వుల ప్రకారం బదిలీలు నిర్వహిస్తున్నామని.. బదిలీలు చేసే విచక్షణాధికారం ప్రభుత్వానికి ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనలను విన్న న్యాయమూర్తి పదోన్నతుల తరువాత బదిలీలు అని నిర్ణయం తీసుకుని దానికి విరుద్ధంగా బదిలీలు ఎలా చేపడతారని ప్రశ్నిస్తూ.. విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news