హైదరాబాద్‌- విజయవాడ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు.. నేడే ప్రారంభం

-

పర్యావరణహితం కోసం.. వాయు కాలుష్యాన్ని నివారించేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ.. వాయు కాలుష్యాన్ని నివారించే ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులను ప్రవేశపెట్టబోతోంది. ఈ-గరుడ బస్సులుగా టీఎస్ఆర్టీసీ వీటికి నామకరణం చేసింది. హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్‌ బస్సులను దశలవారీగా నడపాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా పది బస్సులను ఇవాళ ప్రారంభించనున్నారు. మియాపూర్‌ క్రాస్‌రోడ్స్‌ సమీపంలోని పుష్పక్‌ పాయింట్‌ వద్ద రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సాయంత్రం 5 గంటలకు జెండా ఊపి ప్రారంభిస్తారు. మిగతా బస్సులను ఈ ఏడాది చివరి నాటికి తీసుకొచ్చేలా సంస్థ ప్రణాళిక రూపొందించింది. ఇవి వస్తే ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని చెబుతోంది.

హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఈ-గరుడ ఛార్జి రూ.780గా నిర్ణయించారు. మార్గంలో సూర్యాపేటలో స్టాపేజీ ఇవ్వాలా? వద్దా? అన్న అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.  ఒకట్రెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news