AP News : టెన్త్ మార్కుల ఒత్తిడి.. ఏపీలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలు

-

AP News : ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదలైన తర్వాత జరిగిన రెండు విషాద సంఘటనలు తల్లిదండ్రులను, స్థానిక సమాజాన్ని తీవ్ర కలవరానికి, శోకానికి గురిచేశాయి. కృష్ణా జిల్లాకు చెందిన అర్జువానిగూడెం గ్రామానికి చెందిన జి. అనిల్ అనే విద్యార్థి గత సంవత్సరం టెన్త్ పరీక్షల్లో సైన్స్‌ పరీక్ష మినహా అన్ని సబ్జెక్టుల్లో పాసయ్యారు. ఈ సంవత్సరం కూడా సైన్స్ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఈ నిరాశలో ఆత్మహత్యకు పాల్పడి, ఉరేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా గుండెలు పిండేసే వాతావరణాన్ని సృష్టించింది.

Suicide

మరోవైపు, శ్రీకాకుళం జిల్లాలోని బలగ ప్రాంతానికి చెందిన మరో విద్యార్థి జి. వేణుగోపాలరావు కూడా ఇదే విధమైన విషాద బాట పట్టాడు. ఈ రోజు ప్రకటించిన టెన్త్ క్లాస్ ఫలితాల్లో అతను 393 మార్కులు సాధించాడు. అయితే, తను ఆశించిన మార్కులు రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనై, ఉరేసుకొని జీవితాన్ని ముగించుకున్నాడు. ఈ సంఘటన బలగ ప్రాంతంలో విషాద ఛాయలను అలుముకోవడమే కాక, కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ రెండు ఘటనలు విద్యార్థులపై పరీక్షా ఫలితాలు, సామాజిక ఒత్తిడి వల్ల కలిగే మానసిక ఒత్తిడిని బయటపెట్టాయి. ఈ సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి, విద్యార్థులకు మానసిక మద్దతు, కౌన్సెలింగ్ అవసరాన్ని నొక్కిచెబుతున్నాయి. ప్రభుత్వం, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి, యువ మనసులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటనలు గుర్తు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news