అయోధ్యలో రామమందిరం నిర్మించే చోట 2000 అడుగుల లోతులో టైమ్ క్యాప్సుల్ను ఏర్పాటు చేస్తారని వస్తున్న వార్తలు అవాస్తవమని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తెలిపింది. ఈ ప్రచారాన్ని నమ్మవద్దని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో ఆగస్టు 5న రామాలయ భూమిపూజ కార్యక్రమం సందర్భంగా అక్కడ 2,000 అడుగుల లోతులో టైమ్ క్యాప్సుల్ను ఏర్పాటు చేస్తారని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5న భూమిపూజ కార్యక్రమం జరగనుంది. మందిరం నిర్మించే చోట 2,000 అడుగుల లోతులో టైమ్ క్యాప్సుల్ను భద్రపరచనున్నట్లు ట్రస్టు సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ సోమవారం ప్రకటించారు. రామమందిరానికి సంబంధించిన చరిత్ర, వాస్తవాల పూర్తి వివరాలను ఇందులో పొందుపరచనున్నట్లు చెప్పారు.