ఎమ్మెల్యే భూమనని టెన్షన్ పెడుతున్న తిరుపతి ఉపఎన్నిక

-

తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కొత్త టెన్షన్ పట్టుకుందట. ఉపఎన్నికలో ఎంపీ అభ్యర్థికి తిరుపతి అసెంబ్లీ పరిధిలో వచ్చే మెజార్టీ పై రాజకీయపక్షాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీకి ఇక్కడ అనుకున్నమేర ఓట్లు సాధించకపోవడంతో ఉపఎన్నికలో మెజార్టీ వస్తుందా లేదా అన్నది ఎమ్మెల్యేని టెన్షన్ పెడుతుందట.

తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీల్లో ఎక్కువగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంపైనే వైసీపీలో చర్చ మొదలైంది. 2014, 2019 ఎన్నికల్లో తిరుపతిలో మాత్రమే వైసీపీకి మెజారిటీ తగ్గింది. 2014లో టీడీపీ ఎమ్మెల్యే సీటును ఎగరేసుకుపోవడంతో.. ఇక్కడ ఎఫెక్ట్‌ నాడు లోక్‌సభ పరిధిలోనూ కనిపించింది. వైసీపీకి అనుకున్నంత ఆధిక్యం రాలేదు. అప్పట్లో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి ఎంపీగా పోటీ చేస్తే.. వైసీపీ నుంచి వరప్రసాద్‌ గెలిచారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థికి 30 వేల ఓట్ల ఆధిక్యం వచ్చింది.

2019లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ గాలి వీచినా తిరుపతి అసెంబ్లీ పరిధిలోకి వచ్చేసరికి సేమ్‌ సీన్‌ రిపీటైంది. టీడీపీ ఎంపీ అభ్యర్థికి 3వేల 578 ఓట్ల మెజారిటీ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి 800 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో బయటపడ్డారు. గత రెండు ఎన్నికలకు భిన్నంగా ఈసారి తిరుపతి అసెంబ్లీ పరిధిలో ఎంపీ క్యాండిడేట్‌కు స్పష్టమైన ఆధిక్యం తీసుకురావాలనే పట్టుదలతో వైసీపీ నేతలు ఉన్నారట. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే భూమనపై ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

పార్టీ సమావేశాల్లోనూ మిగతా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల కంటే తిరుపతి పైనే వైసీపీ సీనియర్లు ఎక్కువగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల ముగిసిన తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన భారీ మెజారిటీని భూమన ప్రస్తావిస్తున్నారు. నియోజకవర్గం మొత్తం వైసీపీ గుప్పిట్లోకి వచ్చిందని.. టీడీపీకి మెజారిటీ వచ్చే ఛాన్స్‌ లేదని ధీమాగా చెబుతున్నారట. అయితే లోకల్‌ బాడీ ఎన్నికలు వేరు.. లోక్‌సభ ఉపఎన్నిక వేరు అని ఎమ్మెల్యేను టెన్షన్ పెడుతున్నారట సొంతపార్టీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news