సినిమా రంగ సమస్యలపై రేపు ప్రత్యేక కమిటీ భేటీ.. ఆ తర్వాతే నిర్ణయం..!

-

సినిమా రంగ సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈనెల 27న కమిటీ భేటీ అవుతుందని తెలిపారు. సినిమా షూటింగ్‌ల బంద్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇవాళ తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరిగింది. సినిమా షూటింగ్‌ల నిలుపుదల, టికెట్‌ ధరలపై కూలంకషంగా చర్చించారు. షూటింగ్‌ల బంద్‌పై ఈ సందర్భంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం.సినిమా షూటింగ్‌ల నిలుపుదలపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. తమ మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని ప్రకటించారు. రేపు.. కమిటీ నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు.

నిర్మాణ వ్యయం, ఓటీటీల్లో సినిమాల విడుదలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యంగా ఓటీటీల్లో సినిమా విడుదలపై ఎవరి అభిప్రాయాలను వాళ్లు వెల్లడించారు తప్ప, అందరూ ఏకాభిప్రాయానికి రాలేదని తెలుస్తోంది. దీనిపై కూడా మరోసారి చర్చించే అవకాశం ఉంది. అలాగే స్పెషల్‌ కమిటీలో ఎవరెవరు ఉండాలి? ఏ విభాగాల నుంచి ఎంతమందిని తీసుకోవాలి? ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి?అనే విషయాలను చర్చించారు.

ఈ క్రమంలో తమ అభిప్రాయాలు చెప్పి నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, సుప్రియ తదితరులు సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. తుది నిర్ణయాన్ని కమిటీకి వదిలేశారు. నిర్మాతల మండలి సమావేశానికి దిల్ రాజు, సి.కల్యాణ్ , సునీల్ నారంగ్ , స్రవంతి రవికిశోర్, సుప్రియ, దర్శకుడు తేజ, వైవీఎస్ చౌదరి, అశోక్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news