TSPSC పేపర్ లీకేజీ.. ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్న సిట్

-

TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో డజనుకుపైగా నిందితులను అరెస్టు చేసింది. ముఖ్యంగా ఏఈ పేపర్ ఎంత మందికి లీక్ అయిందనే దానిపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో తాజాగా ముగ్గురు నిందితులను సిట్‌ కస్టడీలోకి తీసుకుంది. చంచల్‌గూడ జైళ్లో ఉన్న షమీమ్‌, రమేశ్‌, సురేశ్‌ను తీసుకువెళ్లిన పోలీసులు.. ముందుగా వైద్య పరీక్షలు జరిపించారు. అనంతరం, హిమాయత్‌నగర్‌లోని సిట్‌ కార్యాలయానికి వీరిని తరలించారు.

ఐదు రోజుల పాటు ఈ ముగ్గురు నిందితులను సిట్‌ అధికారులు విచారించనున్నారు. గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షలో దామెర రమేష్‌కుమార్‌కు 122 మార్కులు, షమీమ్‌కు 126, సురేష్‌ 100కు పైగా మార్కులు సాధించారు. సురేష్‌ను రాజశేఖర్‌రెడ్డికి స్నేహితుడిగా గుర్తించారు. వందకు పైగా మార్కులు తెచ్చుకున్న ఈ ముగ్గురూ లీకైన ప్రశ్నపత్రాల ద్వారానే సాధించినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. క్వశ్చన్ పేపర్ ఎక్కడి నుంచి బయటికి వచ్చిందనే అంశాలతో పాటు ఇంకా ఎంత మందికి పంపించారనే కోణంలో పోలీసులు వీరిని విచారించే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news