పిజ్జా క్యాన్సిల్‌ చేసినందుకు రూ. 10 వేలు ఫైన్ కడుతున్న జొమాటో..! అసలేం జరిగిందంటే..!

-

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోకు కన్స్యూమర్ కమిషన్ షాక్ ఇచ్చింది. జనరల్‌గా మనం ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టి మూడ్‌ మారిపోతే క్యాన్సిల్‌ చేసుకుంటాం.. దాని వల్ల నెక్ట్స్‌ ఆర్డర్‌లో ఫైన్‌ కనిపిస్తుంది. అయితే ఇదే పని కంపెనీయే చేస్తే..రూ.287 విలువైన పిజ్జా క్యాన్సిల్ చేసినందుకు రూ.10,000 ఫైన్ విధించింది. ఇంతకీ ఏం జరిగిందంటే…

రెండేళ్ల క్రితం ఓ కస్టమర్ ఆర్డర్ చేసిన పిజ్జా క్యాన్సిల్ చేసినందుకు జొమాటో రూ.10,000 జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో “జొమాటో యూజర్లకు చెప్పిన సమయానికి ఫుడ్ డెలివరీ అవుతుంది లేదా వారికి డబ్బులు వెనక్కి ఇస్తాం” అని జొమాటో తెగ ప్రచారం చేసింది. దీనికి వ్యతిరేకంగా తన ఆర్డర్ క్యాన్సిల్ చేసినట్టు ఓ కస్టమర్ కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కంప్లైంట్‌పై విచారణ జరిపిన కన్స్యూమర్ కమిషన్ జొమాటోకు షాక్ ఇచ్చింది. పిజ్జా క్యాన్సిల్ చేసినందుకు రూ.10,000 జరిమానా వేసింది.

అజయ్ శర్మ అనే వ్యక్తి 2020లో జొమాటో యాప్‌లో పిజ్జా ఆర్డర్ చేశాడు. తన ఆర్డర్‌కు పేటీఎం ద్వారా రూ.287 పేమెంట్ చేశాడు. రాత్రి 10.15 గంటల సమయంలో ఈ ఆర్డర్ చేశాడు. తన పార్శిల్ ఆన్ టైమ్ డెలివరీ కోసం అదనంగా రూ.10 కూడా చెల్లించాడు. తనకు పార్శిల్ వస్తుందేమోనని ఎదురుచూశాడు. కానీ సరిగ్గా 10.30 గంటల సమయంలో శర్మాకు ఓ నోటిఫికేషన్ వచ్చింది. ఆర్డర్ క్యాన్సిల్ అయిందని, రీఫండ్ కూడా జారీ చేశామన్నది ఆ మెసేజ్ సారాంశం.

అసలు నిర్ణీత సమయంలో పార్శిల్ డెలివరీ చేయడంలో ఇబ్బంది ఉంటే, జొమాటో బుకింగ్ తీసుకోకూడదు.. ఆర్డర్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసిందని, తనకు సర్వీస్ అందించడంలో జొమాటో విఫలమైందని, సరైన సమయానికి పార్శిల్ డెలివరీ చేస్తామని ప్రచారం చేసి తన నుంచి రూ.10 అదనంగా వసూలు చేశారని, కానీ వారే స్వయంగా ఆర్డర్ క్యాన్సిల్ చేశారని అజయ్ శర్మ ఆరోపించారు. అంతే జొమాటో తీరుపై న్యూఢిల్లీలోని కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ చీఫ్ కమిషనర్‌కు అజయ్ శర్మ కంప్లైంట్ చేశారు. అతని ఫిర్యాదును కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ తోసిపుచ్చింది. దీంతో అతను చండీగఢ్ కన్స్యూమర్ కమిషన్‍‌లో కంప్లైంట్ ఇచ్చాడు. జొమాటో తన ప్రచారానికి వాడిన నినాదాన్ని తొలగించాలని కోరాడు.

చండీగఢ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఈ ఫిర్యాదును విచారించి సేవలను అందించడంలో లోపం, అన్యాయమైన ట్రేడ్ ప్రాక్టీస్ లాంటి కారణాలతో జొమాటో అజయ్ శర్మకు రూ.10,000 ఫైన్‌తో పాటు ఉచితంగా భోజనాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం 30 రోజుల గడువు విధించింది. ఏవైనా సంస్థలు సేవలు అందించడంలో విఫలమైతే కస్టమర్లు తమకు కలిగిన ఇబ్బంది గురించి వినియోగదారుల ఫోరం లేదా కన్స్యూమర్ కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఇలాంటి ఫిర్యాదుల్ని పరిశీలించే కన్స్యూమర్ కమిషన్లు వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్టైతే సదరు సంస్థలకు జరిమానాలు విధిస్తుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news