సైబ‌ర్ నేర‌గాళ్ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే.. ఈ 8 టిప్స్ పాటించండి..!

-

టెక్నాల‌జీ మారుతున్న కొద్దీ రోజు రోజుకీ సైబ‌ర్ నేర‌స్థులు కూడా కొత్త కొత్త త‌ర‌హాల్లో నేరాల‌కు పాల్ప‌డుతున్నారు. కొంద‌రు డ‌బ్బు దోపిడీయే ల‌క్ష్యంగా సైబ‌ర్ నేరాలు చేస్తుంటే.. మ‌రికొంద‌రు నెటిజ‌న్ల స‌మాచారం చోరీ చేసేందుకు య‌త్నాలు చేస్తున్నారు. అయితే టెక్నాల‌జీ ఎంత మారినా మ‌నం అప్ర‌మ‌త్తంగా ఉంటే హ్యాక‌ర్లు, డ‌బ్బు దోపిడీ చేసే సైబ‌ర్ నేరగాళ్ల బారి నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. అందుకు గాను కింద ప‌లు టిప్స్‌ను అందిస్తున్నాం. వీటిని పాటిస్తే సైబ‌ర్ ప్ర‌పంచంలో మీరు సురక్షితంగా ఉండ‌వ‌చ్చు. మరి ఆ టిప్స్ ఏమిటంటే…

1. నేటి త‌రుణంలో సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని చాలా మంది త‌మ‌కు సంబంధించిన ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను కూడా ఎడా పెడా సోష‌ల్ సైట్ల‌లో షేర్ చేస్తున్నారు. నిజానికి అలా చేయ‌డం మంచిది కాదు. ఎందుకంటే సైబ‌ర్ నేర‌స్థులు ఈ వివ‌రాల‌ను ఆస‌రాగా చేసుకుని హ్యాకింగ్‌కు పాల్ప‌డ‌వచ్చు. డ‌బ్బులు దోపిడీ చేయ‌వ‌చ్చు. క‌నుక ఏది ప‌డితే అది సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌కుండా ఉండ‌డ‌మే బెట‌ర్.

2. మీకు సంబంధించి ఈ-మెయిల్ ఐడీలు, బ్యాంక్ లాగిన్, పాస్‌వ‌ర్డ్‌లు, సోష‌ల్ మీడియా సైట్ల లాగిన్‌, పాస్ వర్డ్‌ల‌ను తర‌చూ మార్చుకోండి. ఇలా చేయ‌డం వ‌ల్ల హ్యాక‌ర్ల బారి నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం కొన్ని స‌ర్వీసుల్లో 2 స్టెప్ అథెంటికేష‌న్ అందుబాటులో ఉంది. దాన్ని ఎనేబుల్ చేసుకోండి. దీని వ‌ల్ల మీరు ఏ స‌ర్వీస్‌లోకి లాగిన్ అయినా మీ ఫోన్ నంబ‌ర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంట‌ర్ చేస్తేనే లాగిన్ అవుతుంది క‌నుక మీ అకౌంట్లు సేఫ్టీగా ఉంటాయి.

3. రైల్వే స్టేష‌న్లు, బ‌స్టాండ్లు, కేఫ్‌లు, సినిమా హాల్స్‌, మాల్స్, రెస్టారెంట్లు.. త‌దిత‌ర అనేక ప‌బ్లిక్ ప్లేస్ ల‌లో ప్ర‌స్తుతం ఉచితంగా వైఫైని అందిస్తున్నారు. అయితే ఇలాంటి ప‌బ్లిక్ వైఫైల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండండి. అలాంటి సందర్భాల్లో వీలైనంత వ‌ర‌కు మీ ఫోన్‌లోని మొబైల్ డేటానే వాడండి. కుద‌ర‌క‌పోతేనే ప‌బ్లిక్ వైఫైని వాడండి. అది కూడా సుర‌క్షితం అనుకుంటేనే వాడండి. లేదంటే.. మీ ఫోన్‌లో ఉండే డేటా హ్యాక‌ర్ల బారిన ప‌డుతుంది.

4. మీకు సంబంధించిన బ్యాంకు స‌మాచారం, ఓటీపీలు, ఇతర ఏదైనా విలువైన స‌మాచారాన్ని మీ ఇంట్లో మీకు బాగా క్లోజ్‌గా ఉండే కుటుంబ స‌భ్యుల‌కే చెప్పండి. ఇత‌రుల‌తో ఆ స‌మాచారం షేర్ చేసుకోవ‌ద్దు. వారు దాన్ని దుర్వినియోగం చేస్తే న‌ష్ట‌పోయేది మీరే. మీ స‌మాచార‌మే హ్యాక‌ర్ల బారిన ప‌డుతుంది. క‌నుక మీ స‌మాచారం షేర్ చేసేట‌ప్పుడు జాగ్రత్త వ‌హించాలి.

5. సోష‌ల్ మీడియా సైట్లు, ఈ-మెయిల్ సర్వీస్లులో ప్రైవ‌సీ సెట్టింగ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని మీకు అనుగుణంగా మార్చుకుంటే హ్యాక‌ర్ల బారి నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.

6. కంప్యూట‌ర్ (ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌), స్మార్ట్‌ఫోన్‌.. ఇలా గ్యాడ్జెట్ ఏదైనా అందులో యాంటీ వైర‌స్ సాఫ్ట్‌వేర్‌ను క‌చ్చితంగా ఇన్‌స్టాల్ చేయండి. అలాగే పైరేటెడ్ యాప్స్‌ను వాడ‌కండి. వాటిల్లో వైర‌స్‌లు ఉండేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

7. ఫోన్ల‌లో ఫొటోలు తీసుకునే ముందు దాని మెటా డేటాను ఆఫ్ చేయండి. మెటా డేటా అంటే.. మీరు ఫోన్‌లో కెమెరాతో ఫొటోను ఎప్పుడు, ఎక్క‌డ తీశారో ఆ స‌మాచారం అందులో నిక్షిప్త‌మ‌వుతుంది. క‌నుక మెటా డేటా ఆఫ్ చేయాలి. దీంతో మీ ఫొటోలు కూడా సుర‌క్షితంగా ఉంటాయి.

8. సోష‌ల్ మీడియా సైట్లు, ఈ-మెయిల్ అకౌంట్లు, ఇత‌ర ఏ సైట్ లేదా యాప్ అయినా స‌రే వాటిని ఉప‌యోగించాక క‌చ్చితంగా వాటి నుంచి లాగ‌వుట్ అవ్వాలి. లేదంటే ఇత‌రుల‌కు మీ అకౌంట్ల వివ‌రాలు తెలుస్తాయి. త‌రువాత స‌మాచారం చోరీ అయితే బాధ‌ప‌డీ ప్ర‌యోజ‌నం ఉండ‌దు. చాలా మంది ప‌బ్లిక్ పీసీలలో ప‌లు సైట్లలో లాగిన్ అయ్యాక వాటి నుంచి లాగ‌వుట్ అవ‌కుండానే పీసీని ష‌ట్ డౌన్ చేస్తారు. ఈ అల‌వాటును మానుకోవాలి. క‌చ్చితంగా ఏ అకౌంట్ అయినా స‌రే లాగ‌వుట్ అవ్వాల్సిందే.

పైన చెప్పిన టిప్స్ పాటిస్తే ఎవ‌రైనా సైబ‌ర్ నేర‌గాళ్ల బారిన ప‌డ‌కుండా సురక్షితంగా ఉండ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news