అర్జునుడికి గర్వభంగం జరిగింది ఎప్పుడో తెలుసా..?

-

చరిత్రలో ఎన్నో విజయగాథలు. వీటన్నింటి వెనుక మూలపురుషులు గురువులే అనడంలో సందేహం లేదు. గురువు అంటేనే చీకటిని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు. ప్రపంచంలో ధనుర్ధారిగా పేరొందిన మహావీరుడు అర్జునుడు. అటువంటి అర్జునుడికి గర్వభంగం కలిగింది ఎప్పుడో తెలుసా.. అయితే కింది ఈ వృత్తాంతాన్ని చదవండి…

అరణ్యంలో హిరణ్యధన్వుడనే ఎరుకల రాజు ఉండేవాడు. అతడు తన గూడెంలో వారిని మంచి మార్గంలో నడిపిస్తూ, వారిచే చక్కగా గౌరవించబడేవాడు. ఎరుకుల రాజుకు లేకలేక ఒక కొడుకు జన్మించాడు. ఆ చిరంజీవి పేరే ఏకలవ్యుడు.

ఎరుకల జాతివారికి వేట పుట్టుకతో వచ్చే విద్య బాల్యం నుంచి ఏకలవ్యుడికి సాధు జంతువుల మీద చాలా దయ. సాధు జంతువులను చంపే క్రూరజంతువులను వేటాడాలనే మక్కువ ఎక్కువ. అయితే వయస్సుతోపాటు విలువిద్యలో నైపుణ్యాన్ని సంపాదించాలనే కోరిక కూడా ఏకలవ్యునిలో పెరుగుతూ వచ్చింది. కోదండ విద్యను ఉపదేశించే సమర్థుడైన గురువుకోసం గట్టిగా ప్రయత్నం చేయసాగాడు. ఆదే సందర్భంలో హస్తినాపురంలో కౌరవులకు, పాండవులకు ద్రోణాచార్యుడు అనే గురువు సర్వవిద్యలను నేర్పిస్తున్నాడని తెలుసుకుంటాడు.

ద్రోణాచార్యుని కోదండ విద్యా పాండిత్యం తెలిసి హస్తినాపురానికి వెళ్తాడు. సమయం, సందర్భం చూసి ద్రోణాచార్యుని ఏకలవ్యుడు కలుస్తాడు. వినమ్రంగా శిరస్సు వంచి నమస్కరిస్తాడు. తన వెంట తెచ్చిన పుట్టతేనె, ఫలపుష్పాలు గురువుగారి పాదాల చెంత సమర్పించి స్వామి నన్ను ఏకలవ్యుడు అంటారు. హిరణ్యధన్వుడనే ఎరుకల రాజు నా తండ్రి. తమ దగ్గర విలువిద్య నేర్చుకోవాలనే ఆశతో వచ్చాను నాపై దయచూపి నన్ను అనుగ్రహించు తమ శిష్యవర్గంలో చేర్చుకోండి అని ప్రార్థిస్తాడు.

పుట్టింది విద్యాగంధం లేని ఆటవిక జాతిలోనైనా విద్యనేర్చుకోవాలనే తపనతో తన దగ్గరకు వచ్చిన ఏకలవ్యుడుని చూచి ఆచార్యుడు సంతోషిస్తాడు. అయితే ఆనాడు సమాజంలో కొన్ని కట్టుబాట్లు చాలా కఠినంగా ఉండేవి. ఆ కట్టుబాట్లను ఉల్లంఘించటకం అంత సులభం కాదు. అందువల్ల ద్రోణాచార్యుడు మఋదువుగా చిరంజీవీ ఏకలవ్యా ఎరుకల జాతిలో పుట్టిన నీకు విలువిద్య వేరొకరు నేర్పవలయునా? అది నీకు వెన్నతో పెట్టిన విద్య. కనుక నా ఉపదేశం అవసరం లేదు. అని బదులు పలుకుతాడు. పరుషవాక్కులతో తిరస్కరించకుండా, అనునయంగా మాట్లాడి ఆశీర్వదిస్తాడు. ఏకలవ్యుడు ఆచార్యుని సమాధానానికి బాధ పడినప్పటికీ నిరుత్సాహపడడు. ఆయన ఆశీస్సునే ఉపదేశంగా భావిస్తాడు. తన నివాసానికి చేరుకుంటాడు.

ద్రోణుని బొమ్మముందు

ద్రోణాచార్యుని ప్రతిరూపాన్ని మట్టితో మలుచుకుని ఆరణ్యంలో ఒక ప్రదేశంలో ఆ ప్రతిమను ప్రతిష్ఠించుకుంటాడు. ఆ ప్రతిమనే తన గురువుగా భావిస్తూ శ్రద్ధాభక్తులతో పూజిస్తూ,ఏకగ్రతను పెంపొందించుకుంటూ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తాడు.

అప్పటికే ద్రోణాచార్యుని దగ్గర కౌరవ, పాండవులు సకల విద్యలు నేర్చుకుంటుంటారు. అందులో ద్రోణుడు అర్జునికి విలువిద్య విషయంలో ఒక మాటిస్తాడు. విలువిద్యలో ప్రపంచంలోనే సాటిలేని విలుకాడు లేని విధంగా నిన్ను తీర్చిదిద్దుతాను అని వరం అనుగ్రహిస్తాడు.

అర్జుని గర్వభంగం

కౌరవులు, పాండవులు తమ గురువుగారితో కలిసి ఒకనాడు వేటకు అరణ్యానికి బయలుదేరుతారు. అరణ్యంలో క్రూరజంతువులను వేటాడటం ప్రారంభిస్తారు. ఇంతలో అర్జునుడు ఒక క్రూర జంతువును తరముకుంటూ అరణ్యంలో ఒకదిక్కుగా లోపలికి వెళ్తాడు. అతని వెంట వేటకుక్క వస్తుంది. అది మొరుగుతూ, అర్జునుడు తరుముతున్న క్రూరజంతువు పోకడను సూచిస్తూ ముందుపరుగెడుతుంది. అలా వెళ్తున్న కుక్కనోటిలో ఒక్క క్షణంలో పెక్కుబాణాలు వేగంగా వచ్చి గుచ్చుకుంటాయి. కుక్క అరవటం ఆగిపోతుంది. అర్జునుడు కుక్కనోటిలో గుచ్చుకున్న బాణాలను గమనించి నలువైపులా పరికిస్తాడు. సమీపంలో ఎవ్వరూ కనిపించరు. దూరంగా ఎక్కడో ఉన్న వ్యక్తి కుక్క మొరగటం విని, బాణాలు వదిలాడని నిశ్చయించుకుంటాడు. ఆ బాణాలు ఏ దిక్కు నుంచి వచ్చాయో ఆ దిక్కుకు గురిపెట్టి, శరప్రయోగం చేసి చిన్నగా నడకసాగిస్తాడు.

కొంత దూరం పోయే సరికి ఎరుకపల్లే కనిపిస్తుంది. పల్లెకు ప్రారంభంలో ఒక యువకుడు శరచాపాలతో విలువిద్యను అభ్యసించడం గమనిస్తాడు. తన వేటకుక్కపై బాణాలు ప్రయోగించింది ఆ వ్యక్తేనని అర్జునుడు ఊహించాడు.

ఏ ఎరుకల యువకుని సమీపించి ఆ ప్రదేశంలో ఉన్న ద్రోణాచార్యుని ప్రతిమను గమనించి ఆశ్చర్యపోతాడు. నా వేటకుక్కపై బాణాలు వేసింది నీవే కదూ అని ప్రశ్నిస్తాడు అర్జునుడు. మీరేనా నా శిరస్సుపైగల నెమలి పింఛాన్ని ఎగురగొట్టింది అని ఏకలవ్యుడు ఎదురుప్రశ్నిస్తాడు. ఆపాదమస్తకం ఒకరినొకరు పరిశీలించుకుంటారు. ఒకరి విద్యను మరొకరు అంచనా వేసుకుంటారు.

లక్ష్యాన్ని కంటితో చూడాల్సిన అవసరం లేకుండానే, శబ్దాన్ని విని బాణం ప్రయోగించే విధానానికే శబ్దవేది అనిపేరు. ఆ విద్య తనకు మాత్రమే తెలుసునని అర్జునుడి గర్వం. ఈ గర్వం ఏకలవ్య దర్శనంతో తొలిగిపోతుంది. ఇదండి అర్జునుడికి గర్వభంగం జరిగిన సందర్భం. మహా విలుకాడు అయిన ఏకలవ్యుడు గురువు ప్రత్యక్షంగా లేకున్నా ఆయన ప్రతిమను ఏర్పాటు చేసుకుని నేర్చుకున్న విద్య అర్జునుడిని గర్వభంగం చేసిందంటే ఆయన ఎంత శక్తిశాలో అలోచించండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news