ఆ ఫుడ్‌ తిని ఐదేళ్లగా అపానవాయువు వదులుతున్న వ్యక్తి.. ఏకంగా రూ. 2కోట్లకు దావా..!

-

కొన్ని రుచిగా ఉన్నా..అవి మనకు మన పొట్టకు అంత మంచివి కావు. తింటే లేనిపోని సమస్యలు వస్తుంటాయి. ఎక్కువగా గ్యాస్‌ పట్టేసి ఇబ్బంది పడుతుంటాం. అందుకే మసాలా ఐటమ్స్‌, కడుపు ఉబ్బరంగా అనిపించేవి తింటే చాలామంది వెంటనే ఒక గ్యాస్‌ ట్యాబ్లెట్‌ వేస్తారు. లేదంటే అపానవాయువు(పిత్తు) వదులుతూ వాళ్లతో పాటు పక్కన వారిని కూడా ఇబ్బంది పెడతారు. అయితే సాధారణంగా ఏ ఫుడ్‌ తిన్నా దాని ప్రభావం ఒకరోజు లేదా మరుసటి రోజు వరకే ఉంటుంది.. కానీ ఇక్కడ ఒక అతను ఐదేళ్లుగా ఆ ఆహారం తిని అపానవాయువు వదులుతూనే ఉన్నాడు. ఈ బాధ భరించలేక ఆ ఫుడ్‌ విక్రయించిన స్టాల్‌ మీదే దావా వేసేశాడు.
విల్ట్‌షైర్‌లోని చిప్పెన్‌హామ్‌కు చెందిన వ్యక్తి 2017లో తన భార్య పిల్లలతో కలిసి బర్మింగ్‌హామ్‌లోని క్రిస్మస్ మార్కెట్‌ను సందర్శించాడు. అక్కడ అతను హామ్ రోల్ తిన్నాడు. అప్పటి నుంచి అతడు ఆగకుండా గ్యాస్‌ను వదులుతూనే ఉన్నాడు. అది తిన్న కొన్ని గంటల్లోనే తిమ్మిరి, జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడ్డాడు. దీంతో అతడిని వెంటనే హాస్పిటల్‌లో చేర్చారు.
ప్రస్తుతం ఆ బాధితుడికి 46 ఏళ్లు. అతడు ఆ ఫుడ్ తిన్న తర్వాత సుమారు ఐదు వారాలు మంచానికే పరిమితం అయ్యాడట. ఆ తర్వాత ఆరోగ్యం కుదటపడింది.. కానీ, గ్యాస్ సమస్య మాత్రం తగ్గలేదు. పదే పదే పిత్తులు వస్తుండటంతో సిగ్గుతో సచ్చిపోతున్నాడు. చివరికి నిద్రపోతున్నప్పుడు కూడా అపానవాయువు వస్తూనే ఉంది. దీంతో అతడు నిద్రలేమి సమస్య కూడా తోడైంది. పెద్ద శబ్దంతో వదిలే ఆ గ్యాస్ కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులకు గురిచేస్తోంది.
విసుగెత్తిపోయిన బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఆ ఫుడ్‌ను విక్రయించిన స్టాల్‌పై 2 లక్షల పౌండ్లు దావా వేశాడు. అది తిన్న రోజు నుంచి తన క్లయింట్ అలసట, పొత్తికడుపు, అపానవాయువు సమస్యతో బాధపడుతున్నాడని అతడి తరఫు న్యాయవాది పార్కిన్ తెలిపారు. అతడి పేగు పనితీరు మారిపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడినట్లు వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. అది తిన్న తర్వాత అతడికి సాల్మొనెల్లా బ్యాక్టీరియా సోకిందని, అందుకే అతడికి ఈ సమస్య ఏర్పడిందన్నారు. ఈ మేరకు ఆ ఆహారాన్ని విక్రయించిన ఫ్రాంక్‌ఫర్ట్ క్రిస్మస్ మార్కెట్ లిమిటెడ్ నిర్లక్ష్యం వల్లే అతడు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడని, ఇందుకు పరిహారంగా 200,000 పౌండ్లు (సుమారు రూ.2 కోట్లు) కంటే ఎక్కువ చెల్లించాలని న్యాయవాది వెల్లడించారు.
అయితే, ఆ సంస్థ నిందను ఖండించింది. హామ్ హాక్ స్టాల్‌లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా లేదని పేర్కొంది. అయితే, ఆ రోజు అక్కడ ఆహారం తిన్న సుమారు 16 మందిలో ఈ లక్షణాలు కనిపించినట్లు ఫిర్యాదులు ఉన్నాయని లాయర్ పార్కిన్ తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై వాదోపవాదనలు, వాయిదాలు జరుగుతున్నాయి. ఇంకా తీర్పు రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news