‘పాలమూరు’ కమిటీకి సభ్యుల పేర్లు కోరుతూ..కేంద్రానికి కృష్ణా బోర్డు లేఖ

-

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై గత నెల 22న జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పు మేరకు కమిటీ ఏర్పాటుకు కృష్ణా బోర్డు కార్యాచరణ ప్రారంభించింది. ఎన్జీటీ తీర్పునకు అనుగుణంగా కమిటీలో సభ్యుల పేర్లను సూచించాలంటూ కేంద్ర పర్యావరణ- అటవీ మంత్రిత్వ, కాలుష్య నియంత్రణ, జల్‌శక్తి శాఖల కార్యదర్శులకు బోర్డు తాజాగా లేఖలు రాసింది.

పర్యావరణ అనుమతులు లేకుండా ఈ పథకాన్ని నిర్మిస్తున్నందున పర్యావరణ పరిహారం కింద రూ.920.85 కోట్లు చెల్లించాలంటూ ఎన్జీటీ తీర్పివ్వటం తెలిసిందే. మూడు నెలల్లోగా కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఈ మొత్తాన్ని చెల్లించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. దాన్ని బోర్డు నేతృత్వంలో నదీ పునరుద్ధరణ కార్యక్రమాలకు వెచ్చించాలని సూచించింది. దీంతో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను బోర్డు వేగవంతం చేసింది.

కృష్ణా బోర్డును నోడల్‌ ఏజెన్సీగా పేర్కొంటూ కమిటీ ఏర్పాటు బాధ్యతలను ఎన్జీటీ అప్పగించింది. తీర్పు వెలువడిన నెల వ్యవధిలోనే అది పూర్తికావాలని సూచించింది. కమిటీ ఏర్పాటైన నాటి నుంచి ఏడాది లోపు ఏం జరిగిందనేది అది నివేదించాల్సి ఉంటుందని కూడా ట్రైబ్యునల్‌ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22లోపు కూర్పు పూర్తయ్యేలా సహకరించాలంటూ లేఖల్లో బోర్డు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news