మ‌రోసారి ఏపీకి న‌రేంద్ర మోడీ…మే 3న ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం రాక‌

-

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. నామినేషన్లు ముగియ‌డంతో అభ్య‌ర్దులు ప్ర‌చారాల‌ను ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నారు.ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి,మాజీముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇంకా ప‌లువురు ప్ర‌ముఖులు ఏపీ వ్యాప్తంగా విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో అత్య‌ధిక మెజారిటీతో గెలిపించాల‌ని ఓట‌ర్ల‌ను వేడుకుంటున్నారు.ఇదే క్ర‌మంలో దేశ ప్ర‌ధాని ఎన్‌డిఏ కూట‌మి కీల‌క నేత న‌రేంద్ర మోడీ కూడా దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని సాగిస్తున్నారు. ఆయ‌న మ‌రోసారి ఏపీలో ఎన్నిక‌ల ప్ర‌చారం చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. మే నెల 3వ తేదీన ఆయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన‌నున్నారు. ఈ మేర‌కు బీజేపీ నేత‌లు ఆయ‌న టూర్ షెడ్యూల్‌ను ప్ర‌క‌టించారు.

వ‌చ్చేనెల మొద‌టివారంలో అన‌గా 3, 4తేదీలలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 3న మధ్యాహ్నం 2 : 45 కి పీలేరు, సాయంత్రం 6 : 30 కు విజయవాడలో రోడ్ షో నిర్వహించనున్నారు. మరుసటి రోజు 4న మధ్యాహ్నం 3 : 45కు రాజమండ్రి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు మోడీ. ఇప్పటికే ఏపీలో ఓ దఫా ఎన్నికల ప్రచారానికి హాజరైన మోడీ.. తాజాగా మరోసారి ప్రచారానికి వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు.రెండు రోజులపాటు విస్తృత స్థాయిలో కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మోడీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారు కావడంతో ఆయన పాల్గొనే సభలు, రోడ్ షోలపై బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వం దృష్టి సారించింది. ప్రధాని మోడీ పాల్గొనే సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరితోపాటు మాజీసీఎం రాజంపేట ఎంపీ అభ్య‌ర్ధి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఇంకా ప‌లువురు కూటమి నేతలు పాల్గొననున్నారు.

మే 13వ తేదీన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 175 ఎమ్మెల్యే స్థానాల‌కు,25 ఎంపీ సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి.ఈ మేర‌కు ఎన్నిక‌ల సంఘం చక‌చ‌కా ఏర్పాట్లు చేస్తోంది. మోడీ మ‌రోసారి ఏపీకి వ‌స్తున్న క్ర‌మంలో కూట‌మి నేత‌లు ఆయ‌న ప‌ర్య‌ట‌న‌పై బోలెడు ఆశ‌లు పెట్టుకున్నారు.రోజురోజుకీ ఎన్‌డిఏ కూట‌మి గ్రాఫ్ ప‌డిపోతుండ‌టంతో మోడీ రాక‌తో అయినా కాస్త పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని ఆశాభావం వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. ఎలాగైనా ఈ ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని ఆరాట‌ప‌డుతున్న ఎన్‌డిఏ కూట‌మి నేత‌లు పోలింగ్ జ‌రిగే లోపు మ‌రోరెండుసార్లు మోడీని ఏపీకి ర‌ప్పించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news