‘స్వామియే శరణమయ్యప్ప’.. స్వామి అయ్యప్ప దీక్షావిశేషాలు

-

కార్తీక మాసం వచ్చిందంటే ‘స్వామియే శరణమయ్యప్ప’ వాడవాడలా అయ్యప్ప శరణుఘోష వినిపిస్తుంది. స్వామి అయ్యప్ప దీక్ష అంటే కఠిన నియమాలతో కూడి ఉంటుంది.

హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకం. కార్తీక మాసం వచ్చిందంటే వాడవాడలా అయ్యప్ప శరణుఘోష వినిపిస్తుంది. ‘స్వామియే శరణమయ్యప్ప’…  అంటూ భక్తకోటి శబరిమల వైపు అడుగులు వేసేందుకు దీక్ష పూనుతుంటారు. అయ్యప్ప మాలధారణ మొదలుకుని, దీక్షా విధానం, యాత్రా విశేషాలు, పర్యటన పూర్తయి తిరిగి వచ్చేవరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర సౌకర్యాలపై ప్రత్యేక కథనం.

ayyappa swamy deeksha pooja vidhanam
ayyappa swamy deeksha pooja vidhanam

అయ్యప్పను సన్నిధానంలో దర్శించాలనుకునే వారు రెండు రకాలుగా కాలినడక మార్గంలో ప్రయాణిస్తారు. అవి 1. పెద్దపాదం, 2. చిన్నపాదం. పెద్దపాదం ద్వారా స్వామిని దర్శించుకోవాలంటే సుమారు 70 కి.మీదట్టమైన ఆటవీ ప్రాంతంలో పయనించాలి. ఈ ప్రాంతంలో జంతువుల నుంచి భక్తులను రక్షించేందుకు దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారు. సుమారు 20 గంటల సమయం పట్టే ఈ యాత్రలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా భక్తులు జాగ్రత్త వహించాలి. నడక మార్గంలోకి జంతువులు రాకుండా బాంబులతో శబ్దాలు చేస్తుంటారు. స్వామివారిని సులభంగా దర్శించుకోవాలనుకునేవారు పంబా నది దగ్గరలోని కన్నిమూల గణపతి ఆలయం నుంచి కాలినడక ప్రారంభిస్తారు. దీన్ని చిన్నపాదం అంటారు. చిన్నపాదం నిటారుగా ఉంటుంది. పెద్దపాదం నడవలేనివారు చిన్నపాదం ద్వారా అయ్యప్ప సన్నిధానం చేరుకుంటారు. చిన్నపాదం నిడివి 11కి.మీ. నడవలేని భక్తుల కోసం ‘డోలి’ సౌకర్యం నిర్ణీతమైన రుసుముతో అందుబాటులో ఉంటుంది. సన్నిధానంలోకి వెళ్లిన తరువాత బంగారు 18మెట్లు ఎక్కి హరిహరసుతుడైన అయ్యప్పను దర్శించుకుని దివ్యానుభూతికి లోనవుతారు.

అయ్యప్పను సేవించే విధానం…

అయ్యప్పస్వామిని నవవిధ  అనగా శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, నమస్కారం, ధ్యానం, స్కృతం, ఆత్మ నివేదన. స్వామిదీక్షలో ఇరుముడికి మహావిశిష్టత ఉంటుంది. ఇరుముడిలో రెండు ముడులుంటాయి. ఒక ముడిలో అయ్యప్పస్వామి స్వరూప ముద్ర, కొబ్బరికాయ, స్వామివారికి సమర్పించే వస్తువులుంటాయి. కొబ్బరికాయలను స్వచ్ఛమైన ఆవునెయ్యితో నింపుతారు. ఈ నెయ్యి జ్ఞానానికి ప్రతీక. కొబ్బరికాయలను బిగించడం వైరాగ్యానికి చిహ్నంగా భావించి మూతపెడతారు. కాయను ఆత్మ అనే లక్కతో (ప్రస్తుతం గోధుమ పిండితోకూడా) సీజ్‌ చేస్తారు. మనస్సులోని జ్ఞానాన్ని సంపూర్ణంగా అయ్యప్పకు నిండు మనస్సుతో అర్పించుకున్నట్లు భావిస్తారు. దీనినే ఆత్మనివేదన అంటారు. అయప్పస్వామి దీక్షలో పరమార్థం కూడా ఇదే. రెండో ముడి వెనుక భాగంలో ఉంటుంది. ఇందులో బియ్యం, బెల్లం, అటుకులు, కూరగాయలు, పూజా సామగ్రి ఉంచుతారు. బియ్యం, కూరగాయలు పెద్ద పాదంలో పర్యటిస్తున్న సమయంలో వంట కోసం, పూజా సామగ్రి పర్యటన సమయంలో పూజ కోసం స్వాములు ఉపయోగించాల్సి ఉంటుంది.

విశిష్టమైన పదు నెట్టాంబడి (18మెట్లు)…

శబరిమల అయ్యప్ప సన్నిధానంలో ఉండే 18 మెట్లను పరశురాముడు నిర్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. మనిషిలోని 18 రకాల చెడు గుణాలు తొలగిపోవడానికి దీక్షలో పడిపూజ (మెట్టు పూజ) నిర్వహిస్తారు.

 

అయ్యప్ప మాలను ధరించిన ప్రతీసారి చెడు లక్షణాలను విడిచిపెట్టి మంచి వారీగా మారాలని కోరుకుంటూ ఈ పూజను నిర్వహిస్తారని గురుస్వాములు చెప్తుంటారు.

ఇరుముడి యాత్ర సామగ్రి..

 

ఇరుముడి(సంచి రెండు అరలు గల నీలం లేక నల్లరంగు గుడ్డ సంచి)పై పేరు కాని తగిన గుర్తు కాని ఉండాలి. భుజానికి తగిలించుకునే సంచి(మోయగలిగిన సైజులో వీలుగా)పేరు కాని గుర్తు కాని ఉండాలి.
మూడు చిన్న తెల్లగుడ్డ సంచులు ముద్రకాయలు, పూజ ద్రవ్యాలు పెట్టేందుకు తీసుకోవాలి.
రెండు మీటర్ల నూలు తాడు  l  పదునైన కత్తి వాటర్‌బాటిల్‌, మగ్గు, టార్చిలైట్‌ ధరించిన దుస్తులు కాక అదనంగా ఒక నల్లపంచ, తువ్వాలు, దుప్పటి  l  నోట్‌ పుస్తకము, పెన్ను, విభూది, గంథం, కుంకుమ   l  ఒక ప్లేటు, మడిచిపెట్టుకోవడానికి వీలైన తుంగచాప నిమ్మకాయలు, పిప్పరమెంటు బిల్లలు, అవసరమనుకొంటే ఖర్జూర వంటివి వనయాత్రకు బయలుదేరే ముందు కొనుక్కొని పెట్టుకోవాలి. అడవిలో చాలా ఖరీదు ఉంటాయి.

మాలధారణ దశలు…
తొలిసారి – కన్నెస్వామి
రెండోసారి – కత్తిస్వామి
మూడోసారి – గంటస్వామి
నాలుగోసారి – గధస్వామి
ఐదోసారి – పేరుస్వామి
ఆరోసారి, ఆపై – గురుస్వామి

కొత్తగా దీక్ష చేపట్టేవారు అయ్యప్ప దేవాలయంలో గురుస్వామితోగానీ, పూజారితోగానీ మాల ధరించాలి. 12సంవత్సరాల లోపు బాలికలు, 50సంవత్సరాల పైబడిన మహిళలు కూడా అయ్యప్పదీక్ష ఆచరించవచ్చు.

శబరిమలకు ప్రయాణ సౌకర్యాలు…

ప్రస్తుత సీజన్‌లో రైల్వే, ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ప్రారంభించాయి. వీటితో పాటు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ సంస్థలు, కార్లు, లగ్జరీ, డీలక్స్‌ బస్సులు  అందుబాటులో ఉంచాయి. ఈనెల చివరి వారం మొదలుకుని జనవరిలో శబరిమలలో మకర సంక్రాంతి రోజు దర్శనమిచ్చే జ్యోతి వరకు (దీక్షలు ముగిసే వరకు) అయ్యప్ప స్వాములు శబరిమల వెళ్తుంటారు.

రైలు సౌకర్యం…

సికింద్రాబాద్‌- కాజీపేట, నల్లగొండ- నడికుడ మార్గాల్లో రోజూ నడిచే రైళ్లతోపాటు పలు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. నడికుడ మార్గంలో నల్లగొండ మీదుగా ప్రతిరోజు శబరి ఎక్స్‌ప్రెస్‌ వెళ్తుంది. ఈ రైలు మిర్యాలగూడలో కూడా ఆగుతుంది. అయ్యప్ప దీక్షా సీజన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్‌కు ప్రత్యేక బోగీలను కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా సికింద్రాబాద్‌ నుంచి కాజీపేట, వరంగల్‌ మీదుగా ప్రతిరోజు హిమసాగర్‌, కేరళ ఎక్స్‌ప్రెస్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news