తిరుమల స్వామి గడ్డం కింద పచ్చకర్పూరం కథ తెలుసా!!

-

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు. ఆ మూర్తిని కొన్ని సెకన్లు దర్శించుకోవడానికి లక్షలాదిమంది భక్తులు ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చుకొని ఆ స్వామిని దర్శించుకుంటారు. తిరుమలలో ప్రతి అడుగు ఒక చరిత్ర. స్వామి దేవాలయంలో ప్రతి అడుగు వెనుక ఎంతో విశిష్టత. స్వామి ఆర్చితామూర్తి రూపంలో ఎన్నో గాథలు.. విశేషాలు, వింతలు ఉన్నాయి. అలాంటిదొకటి తెలుసుకుందాం… శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు దానికి కారణం తెలుసా? ఎందుకు పచ్చ కర్పూరంతో అలంకరిస్తారో దాని ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఆ విషయాలు…

శ్రీవారి భక్తులలో అగ్రగణ్యుడు అనంతయ్య (అనంతాళ్వారు). ఆ శ్రీవారికి సేవచేస్తూ తరించిన భక్తుడు శ్రీ అనంతాళ్వార్. ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు. ఈయన ప్రతిరోజూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు. ఆయన ఒక రోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకుంటారు.

పూలతోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తరువాత పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయించుకొని, మొదలు పెడతాడు. ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు. చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారుని భార్య నిండు చూలాలు. అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది.

అంతలో ఈ తతంగం అంతా చూసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాలు బాలుని రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు. దానికి అనంతాళ్వారు ఒప్పుకోడు కాని అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు.


ఆమె మట్టితట్టని తీసుకెళ్ళి తొందరగా రావడం గ్రహించిన అనంతాళ్వారులు భార్యని ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. దాంతో అతడు ఆగ్రహానికి గురవుతాడు. అనంతాళ్వారులు కోపంతో చేతిలో ఉన్న గునపాన్ని బాలుడి మీదకి విసురుతాడు. అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడు రూపంలో వచ్చిన వేంకటేశ్వరస్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనబడకుండా మాయం అయిపోతాడు.

ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాళ్వారుకు చెప్తారు. దాంతో కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు. గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చరపోతాడు. తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి వారే అని గ్రహించి కన్నీళ్ళతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు. గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమయం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు.

అప్పటి నుండి రోజూ చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు. అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజూ పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది. శ్రీవారిని గాయపరిచిన గునపాన్ని ఇప్పటికీ మనం మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడవచ్చు. అదండీ స్వామివారి గడ్డం కింది పచ్చకర్పూరం గాథ. ఈసారి స్వామిని దర్శించుకున్నప్పుడు ఒక్కసారి ఈ గాథను గుర్తుచేసుకోండి.. స్వామి వారికి తన భక్తుల గాథను తల్చుకుంటే మరింత సంతోషించి మీకు సులభంగా ప్రసన్నమవుతాడు.
– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news