శాస్త్రం ప్రకారం.. శివ దర్శనం ఇలా చేసినట్లయితే సంపూర్ణ ఫలితం

-

కోరిన కోర్కెలు తీర్చే భోళా శంకరుడు.. భక్తులకు కొంగు బంగారం ఆ శివయ్యం.. శివ.. అంటే సర్వశుభాలను అందించే మహాదేవుడు. ఐశ్వర్యాధిపతి. ఆయన అనుగ్రహం ఉంటే చాలు సమస్తం లభిస్తాయి. అయితే ఇతర దేవతా స్వరూపాల్లా ఆయనకు మూర్తి ఉండదు. అరూపరూపీగా ఆయన లోకంలో భక్తులను అనుగ్రహిస్తాడు. అంటే  రూపం కానీ రూపంలో లింగ రూపంలో ఆయన భక్తుల కోర్కెలను తీరుస్తాడు. అయితే ఆ స్వామిని నేరుగా నేత్రాలతో చూస్తే సంపూర్ణ ఫలం రాదు. శివాలయంలో ఎలా శివదర్శనం చేసుకోవాలి అనే విషయాలను శాస్త్రం చెప్పిన విషయాలను తెలుసుకుందాం…

నంది కొమ్ముల మధ్య నుంచే శివదర్శనం కారణం పరిశీలిస్తే…

శివాలయంలోకి అడుగుపెట్టగానే శివుడి కంటే ముందుగా నంది దర్శనం చేసుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ లింగాన్ని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకుంటారు. పరమేశ్వరునికి నంది అనుంగ భక్తుడు, ద్వారపాలకుడు కూడా. కాబట్టే నందికి అంతట ప్రాధ్యాన్యత. అందుకే లయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. శివాలయంలో లింగాన్ని దర్శించుకునే సమయంలో మనసును భగవంతునిపై కేంద్రీకరించాలి. గర్భాలయంలో చిన్న అఖండ దీపం వెలిగిస్తారు. కేవలం శివాలయంలోనే నంది కొమ్ముల మధ్య నుంచి గర్భగుడిలోని శివలింగాన్ని చూస్తారు.

సాధారణంగా శివాలయానికి వెళ్లేటప్పుడు ప్రదక్షిణ చేసి పరివార దేవతల దర్శనం తర్వాత పరమశివున్ని దర్శించుకుంటాం. కొందరు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణం దర్శనమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఏ శివాలయంలో అయినా పరమేశ్వరుడు శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతల్లా విగ్రహ రూపం కాకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూపం. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని రూపాన్ని మనసు వెంటనే గ్రహించగలదు కానీ, లింగరూపంలో ఉన్న శివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనసుపై కేంద్రీకృతం చేయాలి. అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనసుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి. పృష్ఠ భాగాన్ని నిమురుతు, శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వల్ల నంది అనుగ్రహం కూడా కలిగి శుభకరమైన ఫలితం దక్కుతుంది.

కోరికలు తీరాలంటే ఇలా దర్శనం చేయాలి !

నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక విధానం ఉంది.

కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి, నెమ్మదిగా గోత్రం, పేరు, కోరిక చెప్పడం మంచిది. తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి. గురు, శిష్యుల మధ్య ఎవరూ వెళ్లకూడదు. అందుకనే నంది కొమ్ముల మధ్య నుంచి శివదర్శనం చేసుకోవాలి. పరమేశ్వరుడు తన మూడో కన్ను తెరిస్తే సకలా చరాచర జగత్తు తల్లడిల్లుతుంది. కాబట్టి నేరుగా శివుని ముందుకు వెళ్లరాదని పండితులు చెబుతారు. ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే లోపలికి ప్రవేశించడాన్ని శృంగదర్శనం అంటారు.

రాశి చక్రంలోని మిథున రాశి ఆదిదంపతుల స్వరూపం… వృషభరాశి నందీశ్వర రూపం. రాశి చక్రం ఉదయించే సమయంలో వృభరాశి, మిథున రాశి కిందుగా, అస్తమించే సమయంలో మిథున రాశి, వృషభరాశి కిందుగాను ఉంటుంది. ఆ కారణం వల్లే శివుడు వృషభవాహనుడు, వృషభద్వజుడు అయ్యాడు. నందీశ్వరుడి వృషభ బాగాన్ని స్పృశిస్తూ శివుని దర్శించడం శాస్త్రం చెప్పిన పద్ధతి. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివున్ని దర్శించిన వారికీ కైలాసం ప్రాప్తిస్తుందని శివ పురాణం తెలియజేస్తోంది.

ముఖ్యంగా శ్రీశైల క్షేత్రంలో నందిని శనగల బసవన్నగా పిలుస్తారు. ఆయన చెవిలో పైన చెప్పిన విధంగా కోరికలు చెప్పుకుని శివదర్శనం చేసుకుంటే తప్పక ఆ కోరికలు తీరుతాయని పురాణాల్లో ఉంది. ఇక అదేవిధంగా మీకు దగ్గర్లోని శివాలయాల్లో సైతం శివదర్శనం పైన చెప్పినట్లుగా చేసి స్వామి అనుగ్రహానికి పాత్రులు కండి.

  • కేశవ

Read more RELATED
Recommended to you

Latest news