ఏపీలో బీజేపీ రాజకీయం ఎందుకు జరగదో తెలుసా…?

-

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఘటన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలను ఏకం చేసిందా…? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో హిందుత్వ రాజకీయాలు అనేది పెద్దగా వర్కవుట్ అయ్యే వ్యవహారం కాదు. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ తర్వాత ఎక్కువగా మత ప్రచారం ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చాలా మంది అంటూ ఉంటారు. ఏ రాష్ట్రంలో జరగని విధంగా మతమార్పిడి లు ఏపీలో జరుగుతూ ఉంటాయి గత పదేళ్ల నుంచి ఇది ఎక్కువగా జరుగుతోంది. హిందుత్వ భావం అంత ఎక్కువగా ఉంటే ఎందుకు ఈ స్థాయిలో జరుగుతాయి అని చాలామంది రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించిన సందర్భాలు మనం చూశాం.

ఇప్పుడు అంతర్వేది లో జరిగిన రథం దహనం ఘటనకు సంబంధించి ఏపీలో హిందుత్వ వాదులు ఏకం చేయాలని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇచ్చిన పిలుపు మేరకు హిందూత్వవాదులు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న విశ్వహిందూ పరిషత్ సహా భజరంగ్ దళ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, వంటి హిందుత్వ సంస్థలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున అంతర్వేది వెళ్ళాలి అని ప్రయత్నాలు చేశారు. దీనితో రాష్ట్రంలో హిందుత్వ రాజకీయం మొదలైంది అనే వ్యాఖ్యలు రాజకీయ విమర్శలు చేస్తూ వస్తున్నారు.

అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో చేసిన అంత సులువు కాదు ఏపీలో చేయడం అనేది రాజకీయ పరిశీలకుల మాట. ఉత్తరాది రాష్ట్రాల్లో అక్షరాస్యత శాతం తక్కువ కాబట్టి దానికి తోడు రామ మందిరం ఉంది అక్కడే కాబట్టి హిందుత్వ వాదం అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఎంపీ స్థానాలు ఉండటంతో బీజేపీ కూడా అక్కడ క్షేత్రస్థాయిలో హిందుత్వ వాదాన్ని బలోపేతం చేసే విధంగా గత రెండు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేసి విజయవంతమైంది. అక్షరాస్యతా శాతానికి హిందుత్వ వాదాన్ని కి సంబంధం ఏంటి అంటే… నిరుద్యోగులు అందరినీ హిందుత్వ వాదం పేరుతో పెద్ద ఎత్తున బిజెపి సమీకరించి రామ మందిరం కోసం వారిలో ఒక భావోద్వేగాన్ని రగిల్చింది.

అయితే ఏపీలో పరిస్థితులు ఆ విధంగా ఉండే అవకాశాలు చాలా తక్కువ. దక్షిణాది రాష్ట్రాల్లో ఖాళీగా ఉండటానికి పెద్దగా ఎవరూ ఇష్టపడే పరిస్థితి ఉండదు. మతాల కోసం తిరిగే వారు కూడా చాలా తక్కువగా ఉంటారు. ఇక్కడ వ్యాపారాలు వ్యవసాయం వంటివి ఎక్కువగా జరుగుతూ వుంటాయి. వర్షపాతం కూడా ఎక్కువ కాబట్టి వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. దీనితో హిందుత్వ వాదం మీద దృష్టిపెట్టి ఉద్యమాలు చేసే అంత సీన్ ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ఎవరికైనా భక్తి ఉంటే గుడికి వెళ్లి రెండు కొబ్బరికాయలు కొట్టి వచ్చి తమ పని తాము చూసుకునే పరిస్థితి ఉంటుంది. భక్తి ఉన్నాసరే ఆ వ్యక్తి కోసం పెద్ద ఎత్తున హడావుడి చేయడం ఏదైనా సంఘటన జరిగితే పెద్ద ఎత్తున ప్రజలు వెళ్లడం అనేది చాలా తక్కువ. ఘటనలు జరిగిన సమయంలో అయ్యో పాపం అంటారు గాని వెళ్లి అందులో పాల్గొనే సాహసం చేయడం అనేది అరుదు. కాబట్టి అంతర్వేది లాంటి ఘటనలు జరిగిన ఏపీలో హిందుత్వ వాదులు పెద్ద ఎత్తున ముందుకు వస్తారు అని భావించడం… చాలా పెద్ద తప్పు. అందుకే ఆంధ్రప్రదేశ్లో అంతర్వేది ఘటనపై బిజెపి పిలుపునిస్తే మినహా పెద్దగా ఎవరూ బయటకు రాలేదు. కాబట్టి వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ వ్యవహరించాల్సిన అవసరం అనేది ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news