ఎవరైనా మీ నిద్రను డిస్టబ్‌ చేస్తున్నారా..? కేసు పెట్టొచ్చు తెలుసా..?

-

మనిషికి నిద్ర చాలా ముఖ్యం. నిద్ర లేకపోతే ఆరోగ్యంగా ఉండలేరు. ముఖంలో జీవకళ ఉండదు. అందవికారంగా తయారవుతారు. సరిపడా నిద్ర ఉంటేనే మనం రోజంతా యాక్టివ్‌గా పని చేసుకోగలుగుతాం. బ్రెయిన్‌ యాక్టివిటీ, మానసిక స్థితి మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుంది. జీవితంలో నిద్రకు అంత ప్రాధాన్యం ఉంది. అయితే ఇంట్లో వాళ్లు పక్కనపెడితే..కొన్నిసార్లు పక్కింటి వాళ్లవల్ల, పక్క పోర్షన్‌లో ఉండే వాళ్ల వల్ల మనకు నిద్ర భంగం కలుగుతుంది. అయినా మనం ఏం చేయలేం.. కానీ మీకు తెలుసా నిద్రకు భంగం కలిగించే వారిపై కేసు కూడా ఫైల్‌ చేయవచ్చని.

భారతదేశంలో నిద్రించే హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించారు. అంటే ‘జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ’కు హామీ ఇచ్చే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా నిద్రించడానికి అర్హులు. 2012లో ఢిల్లీలో బాబా రామ్‌దేవ్ ర్యాలీలో, నిద్రిస్తున్న జనంపై పోలీసులు తీసుకున్న చర్యలకు సంబంధించిన కేసు విచారణలో భారత అత్యున్నత న్యాయస్థానం నిద్ర ప్రాముఖ్యతను ప్రాథమిక హక్కుగా సమర్థించింది. ఎవరికైనా నిద్ర లేకుండా చేయడం వారి ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు తీర్పు ఇచ్చింది.

మానవ ఉనికి, మనుగడకు అవసరమైన సున్నితమైన ఆరోగ్య సమతుల్యతను కాపాడుకోవడానికి నిద్ర చాలా కీలకమని కోర్టు స్పష్టం చేసింది. అందువల్ల నిద్రను ఒక ప్రాథమిక మానవ అవసరంగా పరిగణిస్తారు, అది లేకుండా జీవితమే ప్రమాదంలో పడుతుంది. సయీద్ మక్సూద్ అలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా నిద్ర ప్రాముఖ్యతను ప్రాథమిక హక్కుగా హైలైట్ చేసింది. ప్రతి పౌరుడికి మంచి వాతావరణంలో జీవించే హక్కు ఉందని, రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవాలని పేర్కొంది.

సరైన నిద్ర, శాంతియుత జీవనం, ఆలోచనలకు భంగం కలిగించే శబ్దాలను భరించమని ఏ పౌరుడిని బలవంతం చేయకూడదు. ఇది నియమాల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ హక్కును రక్షించడానికి అధికారులు, వ్యక్తులు ఇతరుల నిద్రకు ఆటంకాలు కలిగించకూడదు. ప్రతి ఒక్కరికీ శాంతియుతమైన విశ్రాంతిని ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించడం అనేది కంఫర్ట్‌ మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన సమాజానికి దోహదపడే ప్రాథమిక హక్కు అని తెలుసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news