రేప‌టి నుంచి అమరావతి రైతుల మ‌హాపాద‌యాత్ర‌

-

రేపటి నుంచి అమరావతి రాజధాని రైతుల మహా పాదయాత్ర ప్రారంభం కానున్నాయి. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పోరాటంలో మరో ముందడుగు పడనుంది. రేపటి నుంచి మహా పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో… తుళ్లూరు నుంచి తిరుమల వరకూ రైతులు చేయనున్న ఈ పాదయాత్ర సజావుగా సాగేందుకు 20 కమిటీలను ఏర్పాటు చేశారు. వైకాపా మినహా రాజకీయ పార్టీలన్నీయాత్రకు మద్దతు ప్రకటించాయి.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు 684 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ 29 గ్రామాలకే పరిమితమై సాగుతున్న ఈ పోరాటం… పాదయాత్ర ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించనుంది. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 20 రకాల కమిటీలను, వాటికి బాధ్యులను నియమించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్తున్నందున యాత్రలో స్వామివారి విగ్రహం ఉంచిన వాహనం ముందువరుసలో..ఆ తర్వాత కళాకారుల బృందాలు, మహిళలు, రైతులు, పాదయాత్రకు మద్దతు తెలిపేవారు ఇలా వరుస క్రమంలో సాగుతారు.

యాత్రలో పాల్గొనేవారి జాబితా సిద్ధమైంది.గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పాదయాత్ర సాగనుంది. రోజూ రెండు విడతలుగా… 12నుంచి 14 కిలోమీటర్లు సాగేలా ప్రణాళిక రూపొందించారు. నవంబర్ 1న ప్రారంభమయ్యే పాదయాత్ర మొదటి 6 రోజులు గుంటూరు జిల్లాలో సాగి… పర్చూరు వద్ద ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనుంది. నవంబర్ 8నుంచి 17వ తేదీ వరకూ పది రోజుల పాటు ప్రకాశం జిల్లాలో సాగనుంది. 18వ తేదీన నెల్లూరు జిల్లా కావలికి పాదయాత్ర చేరుకుంటుంది. ఈ జిల్లాలో అత్యధికంగా 16 రోజుల పాటు జరగనుంది. డిసెంబర్ 4వ తేదీన చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అదే నెల 15 వ తేదీ తిరుమల చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు.

Read more RELATED
Recommended to you

Latest news