అనంతపురం: బిరియానీ కోసం ఉద్యోగి కక్కుర్తి.!?

-

సమాజంలో ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. ఇక కొందరికి డబ్బు పిచ్చి ఉంటే.. మరికొందరికి హోదా పిచ్చి ఉంటుంది. కానీ ఓ ఉద్యోగికి బిర్యానీ అంటే పిచ్చనుకుంటా. ఎంత ఇష్టమున్నా డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఫర్వాలేదు. కానీ ఊరికే రావాలన్న అత్యాశే అతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. హోటల్ ఓనర్‌కి అనుమానం రావడంతో నకిలీల కథ అడ్డం తిరిగింది. బిర్యానీ కోసం కక్కుర్తి పడి ఏకంగా జైలుకెళ్లాడు. ఈ షాకింగ్ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం రూరల్ పరిధిలోని నర్సినాయనికుంటకు చెందిన వెంకటేష్ నాయక్ ఎస్టీ కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. బిర్యానీపై మక్కువతో అతని స్నేహితుడు రామాంజి నాయక్‌తో కలసి కన్నింగ్ ప్లాన్ వేశాడు. ఫ్రీగా బిర్యానీ కొట్టేయాలన్న దుర్బుద్ధితో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అవతారమెత్తాడు. అతని ఫ్రెండ్ రామాంజి కారు డ్రైవర్‌గా మారాడు. క్లాక్ టవర్ సెంటర్‌లోని హైదరాబాద్ బిర్యాని హౌస్‌కెళ్లి ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అని చెప్పి ఏడు బిర్యానీ ప్యాకెట్లు తీసుకెళ్లాడు.

ఇక తరచుగా అదే హోటల్‌కి వస్తూ బిర్యానీ ప్యాకెట్లు తీసుకెళ్తున్నారు. అయితే శనివారం మరోసారి వచ్చిన రామాంజి నాలుగు బిర్యానీ ప్యాకెట్లు పార్శిల్ అడిగాడు. ప్రతిసారీ ఇక్కడికే ఎందుకు వస్తున్నారని అనుమానం వచ్చిన హోటల్ ఓనర్ ఖలీల్ బాషా డ్రైవర్‌లా వచ్చిన రామాంజిని ప్రశ్నించాడు. ఫుడ్ ఇన్‌ స్పెక్టర్‌నే అడుగుతావా అంటూ అతను చిందులు తొక్కడంతో వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో అతడు నకిలీలని తేలింది. ఇక ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news