గిరిజనులకు గోరంత ఇచ్చి కొండంత దోచేస్తున్నారు: చంద్రబాబు

-

లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వి భారతి సిమెంట్​కు తరలిస్తూ గిరిజన సంపదను సీఎం జగన్ దోచుకుంటున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. గిరిజనులకు గోరంత ఇస్తూ కొండంత దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మనిషికి స్వార్థం ఉంటుంది కానీ.. జగన్ లాంటి స్వార్థపరుడిని ఇంతవరకూ చూడలేదని చంద్రబాబు విమర్శించారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఇతరులకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన జీవో నెంబర్ 3 గిరిజన హక్కుల్ని కాపాడితే, దాని పరిరక్షణకు వైకాపా ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోలేదన్నారు.

తమ ప్రభుత్వ హయాంలో గిరిజనుల కోసం అమలు చేసిన 18 సంక్షేమ కార్యక్రమాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేసినా అడిగేవాళ్లు లేరనే అహంభావంతో వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఎలిమెంటరీ పాఠశాలలను సైతం ఎత్తేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం గిరిపుత్రిక కళ్యాణం పేరిట రూ.50 వేలు ఇస్తే.. రూ.లక్ష ఇస్తానంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ ఉన్న రూ.50 వేలను కూడా రద్దు చేశారని ఎద్దేవా చేశారు.

గిరిజనుల ఆరోగ్యం, చైత్యన్యం కోసం తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ఎన్నో కార్యక్రమాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్విచక్ర అంబులెన్సులు నిర్వీర్యం చేయటంతో గిరిజన గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే వారిని డోలె కట్టి కిలోమీటర్ల కొద్దీ మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ రద్దు చేసిన అన్ని కార్యక్రమాలను పునరుద్ధరిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆదివాసీ దినోత్సవంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర గిరిజన నేతలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news