పవన్ తో లోకేష్ పర్యటనలు ? కస్సుమన్న సీనియర్లు ?

-

నారా లోకేష్ కు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక అంశం తెరపైకి వస్తూనే ఉంటుంది. ఆయన టార్గెట్ చేసుకుంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తూనే ఉంటారు. దీనికి తోడు సొంత పార్టీ నాయకులు సైతం ఎప్పటికపుడు ఆయన తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ, ప్రత్యర్ధుల తో సమానంగా విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే వీటన్నిటిని అధిగమించి చంద్రబాబు స్థాయిలో తాను బలమైన నాయకుడు అని పార్టీలో నిరూపించుకునేందుకు చినబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. మొన్నటి వరకు కరోనా వైరస్ ప్రభావం కారణంగా, లోకేష్ ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో ఆయన పై వైసిపి నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. 70 ఏళ్ల వయసులో చంద్రబాబు ఏపీలో అప్పుడప్పుడు పర్యటిస్తున్నా, లోకేష్ ఇంటికే పరిమితం అయ్యారు అని, ఆయన ఏవిధంగా టిడిపిని ముందుకు నడిపిస్తారని ఎద్దేవా చేశారు . దీంతో ఆ విమర్శలకు చెక్ పెట్టేందుకు ఎట్టకేలకు ఏపీ లో లోకేష్ అడుగుపెట్టారు. అంతేకాకుండా జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ, పార్టీ నాయకుల్లో ఉత్సాహం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటన పూర్తి చేసిన లోకేష్ తాజాగా అనంతపురం జిల్లాలో నూ పర్యటించారు. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది . ఇక్కడ బలమైన రాజకీయ నాయకులుగా ఉన్న జేసీ బ్రదర్స్ వైసిపి ప్రభుత్వం కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులను ఎదుర్కోలేక, బీజేపీ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు అనే వార్తలు వస్తున్న తరుణంలో, చంద్రబాబు ఇటీవల ప్రకటించిన పార్టీ కమిటీల్లో వారికి అవకాశం దక్కకుండా చేశారు.ఇది ఇలా ఉంటే,  లోకేష్ అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా, ఆయన పర్యటన మొదలయినప్పటి నుంచి, ముగిసే వరకు ఆయన వెంట జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జెసి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. మొత్తం పార్టీ కార్యక్రమాలు అన్నిటినీ జెసి పవన్ ఆధ్వర్యంలోనే సాగడం, ఆయనకు లోకేష్ ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం, వంటి వ్యవహారాలు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
ఎందుకంటే జెసి ఫ్యామిలీ టిడిపి లో ఉన్నా, మిగతా టిడిపి జిల్లా నాయకులు ఎవరికీ , ఆయన పై సానుకూల దృక్పథం లేదు. కానీ లోకేష్ పర్యటనలో జెసి ఫ్యామిలీ కి అత్యధిక ప్రాధాన్యత దక్కడం , పార్టీ సీనియర్ లు ఎవరికీ నచ్చడం లేదు. తాము పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నామని, కానీ జెసి ఫ్యామిలీ 2014 ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ లోనే ఉండి,  టిడిపి నాయకులను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారని, ఇప్పుడు తమను పట్టించుకోకుండా జెసి ఫ్యామిలీ కి ఈ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వడం తగదు చినబాబు  అంటూ  గట్టిగానే  లోకేష్ ను టార్గెట్ చేసుకుని సొంత పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news