సీటు – చోటు: రఘురామకృష్ణం రాజు ధైర్యానికి ఆ రెండే కారణమట!

-

ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. అధికార పార్టీ నుంచి ఆయన బయటకు వెళ్లేందుకే పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. శత్రువుకి కూడా అన్ని కష్టాలు రావొద్దు అన్న రేంజ్ లో.. ఫ్యాన్ కిందనుంచి వెళ్లిపోవాలని ఈ వైకాపా ఎంపీ తెగ కుస్తీలు పడుతున్నారు. జగన్ అంటే ప్రేమ అంటూనే.. వేయాల్సిన పంచులు ఆడాల్సిన వెటకారాలు ఆడేస్తున్నారు. ఈ క్రమంలో… రఘురామకృష్ణంరాజు ధైర్యం ఏమిటన్నదే ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తున్న విషయం. పైకి జిల్లాలో జరుగుతున్న అవినీతి, నియోజకవర్గ ప్రజల సమస్యలు కారణం అని చెబుతున్నా.. అదంతా బ్లఫ్ అని, అసలు కారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు గోదావరిజిల్లా ప్రజానికం!

గత కొద్ది రోజులుగా రఘురామకృష్ణంరాజు వైసీపీ అధిష్టానానికి మామూలు తలపోటుగా మారలేదు. ఆయన చేస్తున్న విమర్శలు, ఇస్తున్న ఇంటర్వ్యూలు వైకాపా అధిష్టానానికి చిన్నసైజు చికాకునే తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో రఘురామకృష్ణం రాజు ధైర్యానికి కారణం రెండు అని తెలుస్తుంది. అందులో ఒకటి బీజేపీ కాగా… మరోకటి మిత్రుడు పవన్ కల్యాణ్ అని అంటున్నారు విశ్లేషకులు!

రఘురామకృష్ణం రాజుకి జిల్లాలో కావాల్సింది నరసాపురం పార్లమెంటు సీటు కాగా.. ఢిల్లీలో కావాల్సింది కేంద్ర ప్రభుత్వంలో చోటు! ఈ రెండు విషయాల ప్రకారం చూసుకుంటే… తర్వాతి ఎన్నికల్లో బీజేపీ – జనసేన పొత్తులో భాగంగా నరసాపురం సీటు సంపాదించుకోవడం పెద్ద విషయం కాదనేది ఆయన ధైర్యం. పవన్ తో ఎలాగూ స్నేహం ఉంది కాబట్టి, తద్వారా బీజేపీతో కేంద్ర ప్రభుత్వంలో చోటు దక్కుతుందని అంచనా వేస్తున్నారంట.

పైగా పవన్ లాంటి స్నేహితులతో కలిస్తే… ఆడింగి ఆట, పాడింది పాటగా ఉంటుంది.. కాస్త ఫ్రీడం ఉంటుంది.. ఇక్కడ జగన్ దగ్గర అయితే అన్ని ఆటలూ సాగవు అని రఘురామ కృష్ణం రాజు ఆలోచించి ఉంటారని, ఆ ధైర్యంతోనే వైకాపాతో లొల్లి పెట్టుకుంటున్నారని అంటున్నారు. తనను సస్పెండ్ చేసే వరకే ఈ హడావిడి.. అనంతరం ఆయన అటు బీజేపీతోనూ, ఇటు పవన్ తోనూ బిజీ అయిపోతారని అంటున్నారు. ఊహలకేముంది రోజుకి లక్ష అనుకోవచ్చు.. కాని భ్రమకి వాస్తవానికి ఎంత దూరమో లెక్కించడం చాలా కష్టమే కదా!

Read more RELATED
Recommended to you

Latest news