అంతర్వేది ఎఫెక్ట్ ..! ఆ మంత్రికి పదవి కట్ ? 

-

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన ఆలయ రథం దగ్ధం అయిన సంఘటన పెద్ద రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జనసేన, బిజెపి, టిడిపి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ఆందోళన నిర్వహించడం ఇలా ఎన్నో చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ, ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేశాయి. అంతకు ముందు వరకు వైసీపీ విషయంలో సఖ్యత గా ఉంటూ వచ్చిన బిజెపి సైతం పూర్తిగా వైసీపీ ని టార్గెట్ చేసింది.

 

ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో తమను టార్గెట్ చేశారని గ్రహించిన సీఎం జగన్ ఈ వ్యవహారంలో మరిన్ని తల కోట్లు రాకముందే, ఈ విషయాన్ని నిగ్గు తేల్చాలి అంటూ, బీజేపీ ద్వారా లేఖ రాయించారు. దీంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది అనుకుంటున్నా, బిజెపి మాత్రం ఈ వ్యవహారం ఇప్పట్లో వదిలిపెట్టేలా కనిపించడం లేదు. తాజాగా ఈ రోజు ఏపీ గవర్నర్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కలిసి వైసీపీ ప్రభుత్వం ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యవహారం పై బిజెపి తీవ్రస్థాయిలో మండిపడుతోంది.
ఈ వివాదం జరుగుతున్న సమయంలో వెల్లంపల్లి నోరు జారి మరీ జనసేన అధినేత పవన్, బిజెపిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతర్వేది సంఘటనపై ఓ సందర్భంలో స్పందించిన వెల్లంపల్లి రథానికి ఇన్సూరెన్స్ ఉందిలే అంటూ మాట్లాడిన మాటలు వివాదాస్పదమైంది. అలాగే విజయవాడ దుర్గమ్మ గుడికి సంబంధించిన వ్యవహారం పైన కొద్ది రోజులుగా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈయన పనితీరుపై జగన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, దీనికితోడు బిజెపి సైతం పదేపదే వెల్లంపల్లి ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ ఉండటం, ఆయన పై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవ్వడం వంటి కారణాలతో వెల్లంపల్లి ను  తప్పిస్తారు అనే ప్రచారం ఊపందుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news