తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు గద్దర్ అవార్డులు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే నెలలో భారీ ఎత్తున ఈవెంట్ ను నిర్వహించి అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో గద్దర్ అవార్డులపై తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి స్పందించింది. గద్దర్ అవార్డుల ప్రదానం చేస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజ్ కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.
ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ప్రోడ్యూసర్స్ కౌన్సిల్ గౌరవ కార్యదర్శి టి.ప్రసన్న కుమార్ ఇవాళ ప్రకటన విడుదల చేశారు. 2024 సంవత్సరానికి గాను ఉత్తమ చలన చిత్రాలకు, ఉత్తమ్ కళాకారులు, సాంకేతిక నిపుణులకు తెలుగు చలనచిత్రం పరిశ్రమలోని ప్రముఖులు, గొప్ప వ్యక్తులు అయినా ఎన్టీఆర్, పైడి జైరాజ్, బీ.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్ల మీద గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ప్రదానం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.