దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులే

-

భారత దేశంలో ప్రస్తుతం ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులే. అసోసియేషన్​ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్​- ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్​(ఎన్​ఈడబ్ల్యూ) అనే సంస్థలు ఓ నివేదిక విడుదల చేశాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్​లను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్లు ఆయా సంస్థలు తెలిపాయి.

ఈ నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్​​ జగన్​ మోహన్​ రెడ్డి.. రూ.510కోట్లు విలువైన ఆస్తులతో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆస్తుల విషయంలో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చిట్టచివరన ఉన్నారు. ఆమె పేరిట కేవలం 15 లక్షల రూపాయల విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నాయి.

ఏడీఆర్​- ఎలక్షన్ వాచ్​ నివేదికలోని కీలకాంశాలు..

30 మంది ముఖ్యమంత్రుల్లో 97 శాతం.. అంటే 29 మంది కోటీశ్వరులు. ఒక్కో సీఎం సగటు ఆస్తి రూ.33.96కోట్లు. ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి (రూ.510కోట్లు); అరుణాచల్ ప్రదేశ్​ ముఖ్యమంత్రి పెమా ఖండూ (రూ.163 కోట్లు); ఒడిశా సీఎం నవీన్​ పట్నాయక్ (రూ.63 కోట్లు).. అత్యంత ఎక్కువ ఆస్తి కలిగిన ముగ్గురు ముఖ్యమంత్రులు.

బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (రూ.15 లక్షలు); కేరళ సీఎం పినరయి విజయన్​ (రూ.కోటి పైన); హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్ ఖట్టర్​ (రూ.కోటి పైన).. అతి తక్కువ ఆస్తి కలిగిన ముగ్గురు సీఎంలు.

2018 శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆస్తి విలువ రూ.23.55కోట్లు. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆస్తి ఒక్కొక్కరిగా రూ.3 కోట్లకు పైగా ఉంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​.. ఆస్తి రూ.కోటికుపైగా ఉండగా.. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎం.కె. స్టాలిన్ (తమిళనాడు సీఎం)​, బసవరాజ్​ బొమ్మై (కర్ణాటక సీఎం).. ఒక్కొక్కరికి రూ.8 కోట్లకుపైగా ఆస్తి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news