సీఎం జగన్‌ వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌ మారింది

-

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు సంబంధించిన కార్యాలయాల విషయంలో పలు మార్పులు చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఒక విషయంలో మాత్రం చాలా రోజులుగా ఎటువంటి మార్పు కనపించలేదు. సీఎం క్యాంపు కార్యాలయంలోని కాన్పరెన్స్‌ హాల్‌లో మాత్రం గోల్డ్‌ కలర్‌లో వృత్తాకార రూపంలో కనిపించే బ్యాక్‌గ్రౌండ్‌ అలానే ఉండేది. చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేసిన ఆ డిజైన్‌.. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక కూడా అలానే కొనసాగుతూ వచ్చింది. వాస్తుపరంగా కొన్ని, తనకు అనుకూలంగా మరికొన్నింటిని మార్చివేసిన సీఎం జగన్‌ దీనిని మాత్రం ఎందుకు అలా వదిలేశాడనేది ప్రశ్నార్థకంగా మారింది.

అయితే దీని మీద సోషల్‌ మీడియాలో కూడా విపరీతమైన చర్చ జరిగింది. బ్యాక్‌గ్రౌండ్‌ డిజైన్‌ను తొలగించడం లేదంటే అది బాగుందని సీఎం జగన్‌ ఒప్పుకున్నట్టే కదా అని టీడీపీ శ్రేణులు చెప్పుకొచ్చాయి. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ మధ్య సామాజిక మాధ్యమాలలో వాదనలు కొనసాగాయి. అయితే తాజాగా వలయకారంలో ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌ డిజైన్‌ను అధికారులు తొలగించినట్టుగా తెలుస్తోంది.

ఈ రోజు(బుధవారం ) కోవిడ్‌-19 నివారణ చర్యలపై సమీక్ష చేపట్టిన సీఎం జగన్‌ వెనకాల ఆ డిజైన్‌ కనిపించలేదు. మంగళ, బుధ వారాల్లో సీఎం జగన్‌ నిర్వహించిన సమీక్షలకు సంబంధించిన ఫొటోలను గమనిస్తే ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ డిజైన్‌ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజముద్రను ఏర్పాటు చేశారు. రెండు రోజుల నుంచి ఇందుకు సంబంధించిన పనులు నడిచినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ప్రజావేదిక తరహాలోనే.. చంద్రబాబు ఎంతో ఇష్టపడి ఏర్పాటు చేసుకున్న డిజైన్‌ కూడా కాలగర్భంలో కలిసిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news