చైనా తర్వాత అతిపెద్ద కరోనా బాధితురాలు భారతే కావచ్చు – నిపుణులు

-

ఆసియా దేశాలు కరోనాను కట్టడి చేసిన విజయవంతమైన మార్గాలు ప్రపంచంలోనే రెండవ అత్యధిక జనాభా కలిగిన భారత్‌లో పనికిరాకపోవచ్చని నిపుణుల అభిప్రాయం.

భారతదేశం ఇప్పటివరకు 209 కరోనా పాజిటివ్‌ కేసులు, 5మరణాలతో ఉంది. రోజురోజుకి పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తన సరిహద్దులు మూసేయడం, విదేశాలనుండి వస్తున్న ప్రయాణీకులను పరీక్షించడం, పాజిటివ్‌ వ్యక్తులను తాకినవాళ్లను ట్రేస్‌ చేయడంలాంటి చర్యలు పూర్తిస్థాయిలో చేపడుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న సాంపిళ్లను పరీక్షించడానికి ప్రస్తుతమున్న 500 సామర్థ్యాన్ని 8000కు పెంచుతున్నట్లు ఐసిఎంఆర్‌ డైరక్టర్‌ జనరల్‌ బలరామ్‌ భార్గవ తెలిపారు. ఇప్పటివరకు విదేశాలనుండివచ్చినవారికే పాజిటివ్‌ వస్తోందని, స్థానికంగా వ్యాపిస్తున్నట్లు ఎటువంటి దాఖలాలు లేవని ఆయన అన్నారు.

కానీ, కొంతమంది నిపుణులు మాత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఏర్పాట్లు, చేపడుతున్న చర్యలు ఏమాత్రం కరోనాను కట్టడి చేయలేవని అభిప్రాయపడుతున్నారు. సోషల్‌ డిస్టన్సింగ్‌ లాంటి వ్యూహాలు కిటకిటలాడుతుండే భారత పట్టణాలు, పల్లెల్లో ప్రభావం చూపలేవని, వైద్య సదుపాయాలు కూడా అంతంతమాత్రమే ఉండటం కూడా ఒక కారణమని వారి భావన.

‘‘ఇప్పటివరకు కరోనా వ్యాప్తి నెమ్మదిగా ఉంది. ఏప్రిల్‌ 15 వరకు ఇంతకు పదిరెట్లు పెరిగే అవకాశముంద’’ని పుణెలోని ఆడ్వాన్స్‌డ్‌ రిసెర్చ్‌ ఇన్‌ వైరాలజీ కేంద్రం మాజీ అధిపతి డా.జాకబ్‌ జాన్‌ ఆందోళన వ్యక్తం చేసారు. ‘‘ఇది ఎవరికీ అర్థం కావడంలేదు. ఇది ఒక సునామీ లేదా తుపాను లాంటిది. వారాలు గడిచినా కొద్దీ దాని స్థాయి భయంకరంగా పెరగుతుంది’’ అని జాన్‌ అంటున్నారు.

భారతదేశ విస్థీర్ణాన్ని అటుంచి, దాని జనసాంద్రత పెద్ద అవరోధంగా మారుతోంది. ఒక చదరపు కిలోమీటరుకు 420మంది జనాభా నివసిస్తున్నారు. చైనాలో ఇది 148 మందికే. దాదాపు అన్ని పట్టణాలు మురికివాడలతో, అల్పాదాయవర్గాల నివాస సముదాయాలతో దుర్భరమైన జీవన స్థితులతో ఉంటాయి.  దక్షిణకొరియా తన ప్రజలలో కరోనా లక్షణాలు లేనివారిని కూడా పరీక్షించగలిగింది. కానీ, ‘‘భారత్‌లో జనసాంద్రత విపరీతంగా ఉండటం వల్ల అది సాధ్యం కాదు’’ అని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసలర్‌ శ్రీనాథరెడ్డి అభిప్రాయపడ్డారు. సామాజిక దూరం అనేది కేవలం పట్టణ మధ్యతరగతి వర్గాలలోనే ఉపయోగపడుతుంది.పట్టణ అల్పాదాయ వర్గాలు, గ్రామీణ జనాభా ఇరుకైన గదుల్లో నివసించడం, పని ప్రదేశం కూడా సామాజిక దూరానికి అనుకూలంగా ఉండకపోవడం వంటి కారణాల వల్ల అది చాలా కష్టసాధ్యమని రెడ్డి స్పష్టం చేసారు.

ఇండియాలో ప్రజారోగ్య వ్సవస్థ పరిధి చాలా తక్కువగా ఉండటం మూలాన, విస్తృతమైన టెస్ట్‌ సెంటర్లు ఏర్పాటు చేయడం కష్టమవుతోంది.  ప్రజలు ఆరోగ్యం కోసం ఖర్చుచేసేది, సాధారణ గృహావసరాల శాతంలో 3.7 శాతం మాత్రమే. ప్రపంచంలోనే అతితక్కువ ఆరోగ్య ఖర్చు ఇది. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనే విషయంలో భారత సామర్థ్యం ఖచ్చితంగా సందేహాస్పదమేనని ప్రొఫెసర్‌ శ్రీనాథరెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news