తెలంగాణకు రానున్న కేంద్ర బ‌ృందాలు

-

పలు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులను తెలుసుకునేందకు కేంద్రం ఇంటర్ మినిస్టీరియల్ బృందాలను పంపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లోని కరోనా వాస్తవాలు తెలుసుకోవడానికి కేంద్రం నాలుగు ప్రత్యేక బృందాలను పంపాలని నిర్ణయం తీసుకుంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించడానికే కేంద్రం ఈ ప్రత్యేక బృందాలను పంపనున్నట్టుగా తెలుస్తోంది.

ఈ బృందాలకు అదనపు కార్యదర్శి హోదా ఉన్న అధికారులు నాయకత్వం వహించనున్నారు. ఇందులో పలు మంత్రిత్వ శాఖల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. తెలంగాణ- హైదరాబాద్, తమిళనాడు- చెన్నై, గుజరాత్- సూరత్‌, అహ్మదాబాద్‌లలో ఈ బృందాలు పర్యటిస్తాయని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ వెల్లడించారు. ఇప్పటికే ఏర్పాటైన ఆరు బృందాలకు ఇవి అదనం అని పేర్కొన్నారు.

అయితే కేంద్రం ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన జిల్లాలకు ప్రత్యేక బృందాలను పంపిన సంగతి తెలసిందే. ఈ బృందాలు లాక్ డౌన్ అమలు, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అంచనా వేయనున్నట్టు కేంద్రం తెలిపింది. అయితే పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం మాత్రం.. కేంద్ర బృందాల రాకపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news