జల జగడం : ప్రధాని మోడీకి ఏపీ సీఎం మరో లేఖ

-

అమరావతి : నీళ్ల పంచాయతీ పై మరోసారి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు ముఖ్యమంత్రి జగన్. పదేపదే కేంద్ర జలశక్తి శాఖకు, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా వివాదాలు పరిష్కారం కావటం లేదని ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్లారు సీఎం జగన్. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణా అక్రమంగా వాడేస్తోందని దీన్ని తక్షణం ఆపేలా చర్యలు చేపట్టాలని లేఖలో కోరారు.

ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి తెలంగాణా రాష్ట్రం అక్రమంగా నీటిని వాడేయటం వల్ల ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని.. ప్రాజెక్టుల్లో తెలంగాణా రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటం వల్ల విలువైన నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి తలెత్తిందని వెల్లడించారు. ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, నీటి పంపకాల విషయంలో కృష్ణా నదీయాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ లాంటి యంత్రాంగాలు ఉన్నప్పటికీ తెలంగాణా యధేచ్చగా నిబంధనల్ని ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు.

తక్షణం తెలంగాణా చేస్తున్న నీటి వినియోగాన్ని నిలువరించకపోతే ఏపీ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని.. విభజన చట్టం ప్రకారం హక్కుగా ఏపీకి చెందాల్సిన నీటి వాటా విషయంలో నష్టపోవాల్సి వస్తుందన్నారు. సాగునీటికి సంబంధించిన అవసరాలు ఉన్నప్పటికీ తెలంగాణా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని.. దీని వల్ల రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీశైలం ప్రాజెక్టులో 834 అడుగుల దిగువన నీటిని ఏపీ వినియోగించుకోలేదని తెలిసీ తెలంగాణా విద్యుత్ ను ఉత్పత్తి చేయటం దారుణమని స్పష్టం చేశారు సీఎం జగన్. జూన్ 1 తేదీ నుంచి 26 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తే అందులో 19 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వాడేశారని పేర్కొన్న ముఖ్యమంత్రి.. ఉమ్మడి ప్రాజెక్టుల పై సీఐఎస్ఎఫ్ రక్షణ కల్పించేలా ఆదేశించాలని లేఖలో కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news