డ్రగ్స్ పార్శిల్ అంటూ.. 6 గంటల్లో రూ.18 లక్షలు దోచేశారు

-

‘నీ పేరు మీద ఓ పార్శిల్ వచ్చింది. అందులో డ్రగ్స్ ఉన్నాయి. నీపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే నేను అడిగిన డబ్బు పంపించు.’ కస్టమ్స్ అధికారినంటూ ఈ విధంగా ఓ యువతికి బెదిరింపు కాల్ వచ్చింది. అదంతా నిజమని నమ్మిన ఆ యువతి భయపడి ఆ వ్యక్తి అడిగినంత డబ్బు బదిలీ చేసింది. చివరకు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

ఎల్బీనగర్‌కు చెందిన యువతి ఐటీ సంస్థలో పనిచేస్తోంది. గత నెలలో ఆమెకు కస్టమ్స్‌ అధికారులమంటూ సైబర్‌ నేరగాడు ఫోన్‌ చేశాడు. ఆమె పేరుతో వచ్చిన పార్శిల్‌లో డ్రగ్స్‌ ఉన్నాయని.. కేసు నమోదవుతోందని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. మళ్లీ ఫోన్‌ చేసి.. ఎఫ్‌ఐఆర్‌ కావొద్దంటే సీబీఐ అధికారులతో మాట్లాడి రహస్య ఒప్పందం చేసుకోవాలని సూచించారు. ఇంకో నంబరు నుంచి మరో వ్యక్తి యువతికి ఫోన్‌ చేశాడు. తాను సీబీఐలో పనిచేస్తానని.. డ్రగ్స్‌ పట్టుబడిన నేపథ్యంలో కేసు కాకుండా తమతో ఒప్పందం చేసుకోవాలని, ఇందుకు కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని నమ్మబలికాడు.

భయపడిన యువతి రెండు విడతల్లో రూ.5 లక్షలు పంపింది. యువతి చేస్తున్న లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండడంతో బ్యాంకు ప్రతినిధులు ఆమె ఖాతాను తాత్కాలికంగా బ్లాక్‌ చేశారు. డబ్బు పంపడం సాధ్యం కాకపోవడంతో సైబర్‌ నేరగాళ్లు యువతితో ఖాతాను అన్‌ బ్లాక్‌ చేయించి మరీ.. మరో రూ.13 లక్షలు వసూలు చేశారు.

ఇలా 6 గంటల వ్యవధిలో మొత్తం రూ.18 లక్షలు కాజేశారు. ఇంకా డబ్బు పంపాలని కోరడంతో యువతి రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news