పాకిస్తాన్ తరచూ పశ్చిమ సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా చొరబాట్లు చేస్తున్న వేళ, భారత రక్షణ రంగం దీనికి సమర్థవంతమైన ప్రతిస్పందనగా స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ‘డ్రోన్-డిటెక్ట్, డెటర్ అండ్ డిస్ట్రాయ్’ (D4) వ్యవస్థను సమర్ధవంతంగా మోహరిస్తోంది. డీఆర్డీఓ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ వ్యవస్థ, ఇజ్రాయెల్ వినియోగించే ఐరన్ డోమ్కు సరితూగే విధంగా పాకిస్తాన్ వినియోగిస్తున్న టర్కిష్ డ్రోన్ల సహా అనేక మానవరహిత వైమానిక వ్యవస్థలను సులభంగా నిర్వీర్యం చేస్తోంది. ఈ యాంటీ-డ్రోన్ పరిష్కారం రూపుదిద్దుకోవడానికి, డీఆర్డీఓ నాలుగు ముఖ్య ప్రయోగశాలలు కలిసి పనిచేశాయి. మల్టీసెన్సర్ ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ, డ్రోన్లను గుర్తించి, వర్గీకరించి, తక్షణమే స్పందించే సామర్థ్యం కలిగి ఉంది. ఇప్పటికే భారత త్రివిధ దళాలలో దీన్ని విజయవంతంగా ప్రవేశపెట్టారు.
D4 వ్యవస్థలో సాఫ్ట్ కిల్ మరియు హార్డ్ కిల్ అనే రెండు కీలక మార్గాల ద్వారా డ్రోన్లను అడ్డుకుంటారు. మొదటగా, డ్రోన్ కమ్యూనికేషన్ను రేడియో ఫ్రీక్వెన్సీ జామింగ్, GNSS జామింగ్, GPS స్పూఫింగ్ పద్ధతులతో భంగపరిచే ప్రయత్నం చేస్తారు. ఇది ఫలించకపోతే, లేజర్ ఆయుధాలతో తూటాల వలె తేలికగా వాటిని కూల్చేస్తారు. ఈ ప్రాజెక్టులో హైదరాబాద్లోని CHESS (Centre for High Energy Systems and Sciences) కీలకపాత్ర పోషించింది. ఈ వ్యవస్థను వాహనాలపై కదిలించేలా లేదా స్థిరంగా అమర్చేలా రూపొందించారు. స్థిర వెర్షన్లు 360 డిగ్రీల కవరేజ్ కలిగి ఉండగా, వాహనాలపై అమర్చినవి యుద్ధ వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి.
‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద, BELతో పాటు అనేక దేశీయ సంస్థల సహకారంతో దీన్ని తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవస్థకు హోం, డిఫెన్స్ మంత్రిత్వ శాఖల నుంచి అనుమతి లభించింది. అంతేకాక, ఇతర దేశాల రక్షణ సంస్థలకు కూడా D4 వ్యవస్థను ప్రదర్శించారు.