టీడీపీలో ఆ ఫైర్‌బ్రాండ్ల దూకుడు ఇంకా ఉండదా?

-

ఏపీ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్ నాయకులకు ఎలాంటి కొదవ లేదు. తమదైన శైలిలో ప్రత్యర్ధులపై విరుచుకుపడే నాయకులు ఇటు అధికార వైసీపీలోనూ, అటు ప్రతిపక్ష టీడీపీలో నూ ఉన్నారు. తమ అధినాయకుడుని గానీ, తమ పార్టీపైన గానీ విమర్శలు చేస్తే ప్రత్యర్ధులకు తెగ కౌంటర్లు ఇచ్చేస్తారు. అలా ప్రత్యర్ధులపై విరుచుకుపడే నాయకుల్లో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, వైవీబీ రాజేంద్రప్రసాద్‌లు ముందు ఉంటారు.

టీడీపీలోవీరు మీడియా సమావేశాల్లో గానీ, టీవీ డిబేట్లలో గానీ ప్రత్యర్ధులకు గట్టిగానే కౌంటర్లు ఇచ్చేవారు. అయితే అనూహ్యంగా టీడీపీలో జరిగిన కొన్ని పరిణామాల తర్వాత ఈ ఇద్దరు ఫైర్‌బ్రాండ్లు కాస్త వెనక్కి తగ్గారు. గతంలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ వైపుకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక వంశీ టీడీపీని వీడాక ఓ టీవీ డిబేట్‌లో రాజేంద్రప్రసాద్‌ని వ్యక్తిగతంగా దూషించి, అవమానించారు.

ఇక వంశీ అలా తిట్టినా సరే రాజేంద్రకు టీడీపీ నుంచి పెద్ద సపోర్ట్ రాలేదు. ఆ ఎపిసోడ్ నుంచి రాజేంద్ర కాస్త ఫైర్ తగ్గించారు. అటు బుద్దా వెంకన్న కూడా టీడీపీలో దూకుడుగా ఉండేవారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తే చాలు వెంటనే రంగంలోకి దిగేసి వైసీపీ నేతలకు కౌంటర్లు ఇచ్చేవారు. సోషల్ మీడియాలో సైతం విజయసాయిరెడ్డిపై విరుచుకుపడేవారు. ఒకానొక సందర్భంలో తాను బాబు భక్తుడి అని ప్రకటించుకున్నారు కూడా.

కానీ అలా బాబు భక్తుడుగా ఉన్న బుద్దా, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా సొంత పార్టీ ఎంపీ కేశినేని నాని చేసిన విమర్శలకు హర్ట్ అయ్యారు. నానికి కౌంటర్ ఇచ్చినా కూడా బుద్దా అంతగా పార్టీలో దూకుడుగా ఉండటం లేదు. చంద్రబాబు, నానికి సపోర్ట్ ఎక్కువ చేస్తున్నారనే ఉద్దేశంతో, ఈ మధ్య సైలెంట్ అయ్యారు. ఇలా ఊహించని విధంగా టీడీపీలో ఫైర్‌బ్రాండ్లుగా ఉన్న బుద్దా, రాజేంద్రలు సైలెంట్ అయిపోయారు. పైగా తాజాగా వీరి ఎమ్మెల్సీ పదవీకాలం కూడా ముగిసింది. దీంతో వీరు టీడీపీలో దూకుడుగా కష్టమని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news