జర్నలిస్టులకు శుభవార్త.. అక్రిడేషన్ ఉన్నవారికి ఈహెచ్ఎస్

-

తెలంగాణలోని జర్నలిస్టులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు శుభవార్త చెప్పారు. అక్రిడేష‌న్ కార్డు క‌లిగిన జ‌ర్న‌లిస్టులంద‌రూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్) పరిధిలోకే వస్తారని, అయితే ఈ పథకాన్ని పక‌డ్బందీగా అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే విరాహత్ అలీల నేతృత్వంలో యూనియన్ ప్రతినిధుల‌ బృందం గురువారం సాయంత్రం అరణ్య భవన్‌లో మంత్రి హ‌రీశ్‌రావుతో సమావేశమై హెల్త్ కార్డుల సమస్యపై వినతి పత్రాన్ని అందించింది. కార్పోరేట్ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులు తిరస్కరణకు గురవుతుండడంతో జర్నలిస్టులు పడుతున్న కష్టాలను ప్రతినిధుల‌ బృందం మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ రావు త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు.

జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ వర్తిస్తుంది : మంత్రి హరీష్ రావు

ఈహెచ్ఎస్ అమలుకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులను విడుదల చేస్తున్నట్లు హ‌రీశ్‌రావు చెప్పారు. ఈ పథకం అమలును పర్యవేక్షించడానికి గాను ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా టీయుడబ్ల్యుజే ప్ర‌తినిధుల బృందం మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపింది. మంత్రిని కలిసిన ప్రతినిధి బృందంలో ఐజేయూ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, టీయుడబ్ల్యుజె ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, కార్యదర్శి ఫైసల్ అహ్మద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రాజేష్, హెచ్‌యూజే కార్యదర్శి శిగా శంకర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, టీయుడబ్ల్యుజె రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news