ఇండియ‌న్ క్రికెట్ టీం ఫొటోలో అనుష్క శ‌ర్మ.. ఆగ్ర‌హిస్తున్న అభిమానులు..!

-

విరుష్క‌.. అదేనండీ.. భార‌త క్రికెట్ టీం కెప్లెన్ విరాట్ కోహ్లి, అత‌ని భార్య అనుష్క శ‌ర్మ‌లు ఉన్నారు క‌దా. వారే.. ఈ సారేం వివాదంలో ఇరుక్కున్నారు ? అనేగా మీరు అడ‌గ‌బోయేది. అవును మ‌రి, వారి గురించి ఎప్పుడు చెప్పినా ఏదో ఒక వివాదం వారి వెంటే ఉంటోంది. అయితే ఈ సారి వారు ఎందుక మ‌రోసారి వివాదాస్ప‌దం అయ్యారంటే.. ఏమీ లేదు.. ఇటీవ‌లే భారత్ ఇంగ్లండ్‌ల మ‌ధ్య టెస్ట్ సిరీస్ ఆరంభం అయింది. మొద‌టి టెస్ట్‌లో గెలుపుకు చాన్స్ ఉన్న‌ప్ప‌టికీ టీం ఇండియా బ్యాట్స్‌మెన్ విఫ‌లం చెంద‌డం కార‌ణంగా జ‌ట్టుకు ఓట‌మి త‌ప్ప‌లేదు. అయితే గెలుపోట‌ముల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఇండియ‌న్ టీంకు తాజాగా లండ‌న్‌లో ఉన్న భార‌త హై క‌మిష‌న్ విందు ఇచ్చింది. కానీ ఆ విందుకు కోహ్లి త‌న‌తోపాటు త‌న భార్య అనుష్క శ‌ర్మ‌ను కూడా తీసుకువెళ్ల‌డం ఇప్పుడు వివాదాస్ప‌ద‌మైంది.

ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందు బీసీసీఐ టీమిండియా ఆట‌గాళ్ల‌కు ఓ ఆదేశం చేసింది గుర్తుంది క‌దా. మ్యాచ్‌ల సంద‌ర్భంగా క్రికెట‌ర్లు త‌మ గ‌ర్ల్ ఫ్రెండ్స్‌, భార్య‌ల‌కు దూరంగా ఉండాల‌ని చెప్పింది. అయితే అనుష్క శ‌ర్మ మాత్రం లండ‌న్ లోనే కోహ్లితో క‌లిసి ఉంటోంది. వీరిద్ద‌రూ హ‌నీమూన్‌కు వ‌చ్చిన జంట‌లా కాలం గ‌డుపుతున్నారు. అయితే మొద‌టి టెస్ట్ మ్యాచ్ అనంత‌రం ఇండియ‌న్ ఆట‌గాళ్ల‌కు లండ‌న్ లో అక్క‌డి భార‌త హై క‌మిష‌న్ విందునివ్వ‌గా, దానికి కూడా కోహ్లి, అనుష్క శ‌ర్మ‌లు క‌ల‌సి వ‌చ్చారు. అంతేకాదు విందు సంద‌ర్భంగా జ‌రిగిన ఫొటో సెష‌న్‌లో పాల్గొన్నారు.

భార‌త క్రికెట‌ర్లు, హై క‌మిష‌న్ సిబ్బందితోపాటు అనుష్క శ‌ర్మ‌ను కూడా మ‌నం ఫొటోలో చూడ‌వ‌చ్చు. అయితే బీసీసీఐ ఆదేశాల‌ను బేఖాత‌రు చేస్తూ కోహ్లి త‌న భార్య‌తో ఎలా ఉంటాడ‌ని అభిమానులు ఇప్పుడు ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు, టీమిండియా ఆట‌గాళ్ల‌కు మాత్ర‌మే ఇచ్చిన విందుకు అనుష్క శ‌ర్మ ఎలా హాజ‌ర‌వుతుంద‌ని, అది ఫ్యామిలీ ఫంక్ష‌న్ కాద‌ని, అలా అయితే మిగిలిన ఆట‌గాళ్ల‌కు ఆ అవ‌కాశం ఎందుకు క‌ల్పించ లేదు, విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ‌లు మాత్ర‌మే ఎందుకు ప్ర‌త్యేకం.. అని ప్ర‌శ్నిస్తూ అనేక మంది నెటిజ‌న్లు ట్విట్ట‌ర్‌లో బీసీసీఐపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నిజానికి ఆ ఫొటోను ట్వీట్ చేసింది బీసీసీఐయే. దీంతో ట్విట్ట‌ర్‌లో బీసీసీఐని అంద‌రూ విమ‌ర్శిస్తున్నారు. ఓ వైపు క్రికెట‌ర్లు భార్య‌లు, గ‌ర్ల్ ఫ్రెండ్స్‌కు దూరంగా ఉండాల‌ని బీసీసీఐ ఆదేశించినా, ఆ ఆదేశాల‌ను కోహ్లి బేఖాత‌రు చేయ‌డం ఏంట‌ని, దీనిపై బీసీసీఐ ఎందుకు ప్ర‌శ్నించ‌దు అని కొంద‌రు కామెంట్లు చేశారు.

అలాగే.. అస‌లు అనుష్క శ‌ర్మ ఇండియ‌న్ క్రికెట్ టీంలో ఆడ‌డం ఎప్పుడు ప్రారంభించింది, ఆమె టీమిండియా వైస్ కెప్టెనా, వైస్ కెప్టెన్ అజింక్యా ర‌హానే ఎక్క‌డో దూరంగా ఉన్నాడు, టీంతో సంబంధం లేని అనుష్క శ‌ర్మ‌ను ముందు వ‌రుస‌లో ఉంచారు.. అంటూ మ‌రికొంద‌రు ట్వీట్లు చేశారు. అయితే ఈ విష‌యంపై బీసీసీఐ స్పందించ‌లేదు. ఏది ఏమైనా విరుష్క జంట మాత్రం వార్త‌ల్లోకెక్కిన‌ప్పుడల్లా ఏదో ఒక వివాదం వారి వెన్నంటే ఉంటోంది..!

Read more RELATED
Recommended to you

Latest news