కర్ణాటకలో జేడీఎస్ కౌన్సిలర్​కు జిల్లా కోర్టు షాక్

-

కర్ణాటక రాష్ట్రంలో ఓ జేడీఎస్ కౌన్సిలర్​కు ఓ జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. భారీగా ఆస్తులున్న, తెల్ల రేషన్​ కార్డ్​ కలిగి ఉన్న నగర పాలక సంస్థ కౌన్సిలర్​ ఎన్నిక చెల్లదని ప్రకటించింది. ఎన్నికల అఫిడవిట్​లో వాస్తవాల్ని దాచిపెట్టారని నిర్ధరిస్తూ తుమకూరు జిల్లా సిరాలోని న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఫలితంగా జేడీఎస్​ కౌన్సిలర్ రవి శంకర్​ పదవి కోల్పోయారు.

2021లో జరిగిన సిరా నగరపాలక సంస్థ ఎన్నికల్లో 9వ వార్డుకు జేడీఎస్ తరఫున రవిశంకర్, కాంగ్రెస్ నుంచి కృష్ణప్ప పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో రవి శంకర్ గెలుపొందగా.. అతడి​ ఎన్నికను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్​ వేశారు కృష్ణప్ప. ఓ క్రిమినల్ కేసులో దోషిగా తేలిన విషయాన్ని ఎన్నికల అఫిడవిట్​లో పేర్కొనలేదని వాదించారు. 500 కిలోల బంగారం ఉందని, అద్దెల ద్వారా రూ.3.6లక్షల ఆదాయం వస్తోందని అఫిడవిట్​లో చెప్పినా.. రవి శంకర్​ పేదలకు ఇచ్చే బీపీఎల్​ రేషన్​ కార్డ్ కలిగి ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కృష్ణప్ప.

ఈ ఆరోపణలపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేశారు రవి శంకర్. క్రిమినల్ కేసు గురించి అఫిడవిట్​లో ప్రస్తావించడం మర్చిపోయానని కోర్టుకు నివేదించారు. తన దగ్గర 499.5కిలోల వెండి, 500 గ్రాముల బంగారం ఉందని.. అయితే అఫిడవిట్​లో రెండూ కలిపి 500 కిలోల ఆభరణాలు ఉన్నాయని పేర్కొన్నానని వివరించారు. కానీ.. కోర్టు విట్​నెస్​ బాక్స్​లో ఈ విషయాలు చెప్పలేదు రవి శంకర్. లిఖితపూర్వక సమాధానంతో సరిపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news