జగిత్యాలలో తన గురువును కలిసిన కేసీఆర్

-

బస్సు యాత్రలో భాగంగా జగిత్యాలలో బస చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, స్థానికంగా నివాసం ఉంటున్న తన చిన్న నాటి గురువు ప్రముఖ కవి జైశెట్టి రమణయ్య గారి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. వయోభారంతో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న వారిని కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా తాను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో సిద్దిపేట జూనియర్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా తనకు చరిత్ర పాఠాలు నేర్పిన నాటి జ్ఞాపకాలను కేసీఆర్ నెమరు వేసుకున్నారు.ఇంతింతై వటుడింతయై అన్నట్టుగా ఎదిగిన తన ప్రియ శిష్యుణ్ణి చూసిన గురువు రమణయ్య గారు ఎంతగానో సంబురపడ్డారు.

తెలంగాణ ప్రజల పట్ల ఆనాటి నుంచి కేసీఆర్ కున్న శ్రద్ధను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. సిద్దిపేట జిల్లా కావాలని 30 ఏండ్ల కిందనే కేసీఆర్ నాటి కేంద్ర మంత్రికి వినతిని అందించిన విషయాన్ని గురువు రమణయ్య గుర్తు చేశారు. ప్రజలను చైతన్యం చేసి ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత నీదేనని తన శిష్యుడు కేసీఆర్ ను కొనియాడారుసాధించిన రాష్ట్రాన్ని అనతి కాలంలోనే అభివృద్ధి చేసి తెలంగాణ ఔన్నత్యాన్ని దేశంలో నిలిపావని మెచ్చుకున్నారు.కష్టాలను నష్టాలను సుఖాలను బాధలను జయాలను అపజయాలను సమ స్థితిలో స్వీకరించడం కేసీఆర్ కు చిన్ననాటి నుండీ అలవాటేనని అదే ఆయన విజయాలకు మూలమని, అదే స్థిత ప్రజ్ఞతను కొనసాగిస్తూ భవిష్యత్తులో విజయాలు సాధిస్తూ తెలంగాణ ప్రజల కన్నీళ్లు తూడ్చడంలో ముందుండాలని, తెలంగాణ ప్రజల సంక్షేమానికి ఇంకా చాలా చేయాల్సి ఉన్నదని తన శిష్యునికి రమణయ్య ఉద్భోదించారు.తనను పరామర్శించడానికి వచ్చిన శిష్యుడు కేసీఆర్ తో పావుగంట పాటు ఇష్టాగోష్టి కొనసాగించారు.అనంతరం గురువు వద్ద మరోసారి ఆశీర్వాదం వీడ్కోలు తీసుకుని తన పదమూడో రోజు బస్సు యాత్రను కొనసాగించేందుకు కేసీఆర్ ముందుకు కదిలారు.బస్సుయాత్ర నిజామాబాద్ దిశగా కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news