మంత్రి వెల్లంపల్లి అందుకే చిక్కుల్లో పడ్డారా ?

-

ఏ ముహూర్తాన మంత్రయ్యారో కానీ వెల్లంపల్లి శ్రీనివాస్‌ సున్నితమైన అంశాల్లో ఆయనే టార్గెట్టుగా మారుతున్నారు. ఇప్పుడు దుర్గ గుడిలోని ఉద్యోగుల అవినీతి.. ఏసీబీ సోదాల్లోనూ మంత్రే హాట్‌ టాపిక్‌గా మారారు. సంబంధిత శాఖకు చెందిన మంత్రిగానే కాకుండా.. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అవినీతి.. అక్రమాలకు ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ఆయనకు సంబంధం ఉందనే విమర్శలు జోరుగా సాగుతున్నాయి. అయితే మంత్రి వెల్లంపల్లికి సంభందించిన ఇద్దరు సన్నిహితుల మూలంగానే చిక్కుల్లో పడ్డారా..ఏసీబీ దాడుల్లో కార్నర్ అయ్యారా అన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో నడుస్తుంది.


ఇంద్రకీలాద్రి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాల విషయంలో ఏసీబీ దాడులు.. సోదాలు చేయాల్సి వస్తే.. కచ్చితంగా సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ముందుకెళ్తారని అధికారపార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ క్రమంలో కొండపై రోజుల తరబడి ఏసీబీ సోదాలు చేయడాన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదంటున్నారు. అయితే సీఎంకి ఈ విషయాన్ని చేరవేసిన వారెవరనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎంకు సన్నిహితంగా ఉంటూ నిత్యం సీఎంఓతో.. సీఎం పేషీలో విధులు నిర్వహించే అధికారులతో టచ్‌లో ఉండే వారివల్లే ఈ వ్యవహారం నడిచిందనే చర్చ జరుగుతోంది.

దుర్గగుడిలో జరిగే ప్రతి వ్యవహరంలోనూ మంత్రి వెల్లంపల్లిని నిత్యం అంటిపెట్టుకునే ఉండే వారివల్లనే ఈ పరిస్థితులు వచ్చాయట. అలాంటి సన్నిహితులకే దుర్గగుడిలో కీలక పనులను అప్పగించారట. సెక్యూరిటీ మొదలుకుని.. ఇతరాత్ర కీలక వ్యవహారాలు.. ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న మెజార్టీ పనులు వారికే దక్కుతున్నాయనేది ప్రధానమైన అభియోగం.

గతంలోనే ఒకటి రెండు సందర్భాల్లో సీఎం దుర్గగుడికి వచ్చేటప్పుడు మంత్రి సన్నిహితులుగా ముద్రపడ్డ సదరు వ్యక్తులు ఫ్లెక్సీలు కట్టి.. హంగామా చేయబోయారట. ఆ క్రమంలో ముఖ్యమంత్రికి.. సీఎం పేషీకి సన్నిహితంగా ఉండే ఓ కీలక నేత వారిని పక్కకు తప్పుకోవాలని హెచ్చరించారట. కొండ మీద జరిగే వ్యవహారాలన్నీ సీఎం దృష్టిలో ఉన్నాయని.. ఎవరెవరేం చేస్తున్నారు..? ఎంతెంత వెనకేస్తున్నారనే విషయాలన్నీ సీఎం పేషీకి నేరుగా వెళ్లిపోతున్నాయని వార్నింగ్ కూడా ఇచ్చారట.

ఆ నేత హెచ్చరికల తర్వాత కూడా ఇంద్రకీలాద్రిపై అక్రమాలు కొనసాగడంపై ముఖ్యమంత్రో.. సీఎంవోనో నేరుగా రంగంలోకి దిగిందని టాక్‌. ఆ తర్వాతే ఏసీబీ ఎంట్రీ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news