జైల్లో మొబైల్‌తో పట్టుబడితే మూడేళ్ల శిక్ష.. కేంద్రం కొత్త ప్రతిపాదన

-

జైల్లో మొబైల్‌ ఫోన్లు వాడుతూ పట్టుబడినవారికి మూడేళ్ల జైలు శిక్ష విధించాలని కేంద్ర కొత్తగా ఓ ప్రతిపాదన రూపొందించింది. నిబంధనలకు విరుద్ధంగా  ఖైదీలు, సందర్శకులు, లేదంటే అధికారులు.. ఎవరైనా మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు వాడినట్లయితే ఈ శిక్ష విధించాలని ఆదేశాలు జారీ చేసింది. నిషేధిత వస్తువులను ఆధీనంలో ఉంచుకున్నా, ఉపయోగించినా, జైల్లోకి ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినా, లేదంటే.. ఉన్నవాటిని తొలగించేందుకు సహకరించినా, ఖైదీలకు సరఫరా చేసేందుకు ప్రయత్నించినా శిక్ష విధించాలని పేర్కొంది.

ఇతర నేరాలను ప్రోత్సహించిన వారికీ గరిష్ఠంగా మూడేళ్ల శిక్ష, రూ.25వేల జరిమానా విధించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన నమూనా చట్టాన్ని (మోడల్‌ ప్రిజన్స్‌ అండ్‌ కరెక్షనల్‌ సర్వీసెస్‌ యాక్ట్‌-2023ని) కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు పంపింది. జైలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పదేపదే నేరాలకు పాల్పడేవారికీ మూడేళ్ల శిక్ష విధించే అవకాశాన్ని ఈ చట్టంలో ప్రస్తావించింది.

మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొత్త నమూనా చట్టాన్ని రూపొందించినట్లు కేంద్రం తెలిపింది. దీనిని రాష్ట్రాలు స్వీకరించి అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా. ఈ నమూనా చట్టంలో మొత్తం 21 అధ్యాయాలున్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version