ప్రికాషన్‌ డోసుగా కార్బెవ్యాక్స్‌.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

-

తొలి రెండు టీకా డోసులుగా కొవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్‌ తీసుకున్న 18 ఏళ్లు పైబడినవారికి ముందుజాగ్రత్త డోసుగా బయోలాజికల్‌ ఈకి చెందిన కార్బెవ్యాక్స్‌ను వినియోగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు అధికారిక వర్గాలు బుధవారం వెల్లడించాయి.

ఎన్‌టాగీ (ఇమ్యునైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం) వర్కింగ్‌ గ్రూప్‌ సిఫార్సు మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఈ అనుమతులు ఇచ్చినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. తొలి రెండు డోసులు కొవాగ్జిన్‌ లేదా కొవిషీల్డ్‌ తీసుకున్న వయోజనులకు(18ఏళ్లు పైబడిన వారు) ఆరు నెలలు పూర్తయిన తర్వాత ప్రికాషన్‌ డోసు ఇచ్చేందుకు కార్బెవ్యాక్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కొవిన్‌ పోర్టల్‌లో ఇందుకు సంబంధించి మార్పులు కూడా చేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా.. కొవిడ్‌-19కు సంబంధించి తొలి రెండు డోసులుగా ఒక కంపెనీ టీకా, ముందుజాగ్రత్త డోసుగా వేరే కంపెనీ టీకా వేయడం ఇదే తొలిసారి.

కార్బెవ్యాక్స్‌ టీకాను హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఈ సంస్థ అభివృద్ధి చేసింది. ఆర్‌బీడీ ప్రొటీన్‌ ఆధారిత తొలి స్వదేశీ కరోనా టీకా ఇదే. ప్రస్తుతం ఈ టీకాను 12-14 ఏళ్ల చిన్నారులకు ఇస్తున్నారు. అయితే, 18 ఏళ్లు పైబడి తొలి రెండు డోసులు కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్‌ తీసుకున్నవారికి ప్రికాషన్‌ డోసు కార్బెవ్యాక్స్‌ ఇచ్చేలా బయోలాజికల్‌ ఈ విజయవంతంగా క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహించింది. అందుకు సంబంధించిన డేటాను పరిశీలించిన కొవిడ్‌ 19 వర్కింగ్ గ్రూప్‌.. ఈ టీకాను ముందు జాగ్రత్త డోసుగా ఇవ్వొచ్చని సిఫార్సులు చేసింది. ఇందుకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ కూడా ఆమోదం తెలపడంతో.. కేంద్రం నేడు అనుమతులిచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Latest news