ఈనెల 17న ప్రధాన మంత్రి మోదీ పుట్టిన రోజు సందర్భంగా నమీబియా నుంచి మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ పార్కుకు ఎనిమిది చీతాలు చేరాయి. అయితే ఈ చీతాలకు ఏం పేర్లు పెట్టాలనేదానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయం ప్రధాని మోదీ దృష్టికి వెళ్లింది. అయితే మోదీ గత ఆదివారం మన్ కీ బాత్ లో ఈ చీతాలకు ఏం పేర్లు పెట్టాలో సూచించమని ప్రజలను కోరారు.

ఇదే విషయమై మోదీ మంగళవారం రోజున ప్రధాని మోదీ చీతాల కోసం పేర్లు సూచించాలని ప్రజలను మరోసారి కోరారు. ‘మైగవ్’ వేదికకు పంపిన పేర్ల నుంచి విజేతలను ఎంపిక చేసి కునో జాతీయ పార్కులో చీతాల సందర్శనకు అనుమతిస్తారు. ఈ పోటీకి పేర్లు పంపేందుకు చివరి తేదీ అక్టోబర్ 26. ఇక అప్పటి నుంచి చీతాల నామకరణానికి పేర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల నుంచి ఇప్పటిదాకా 750 సూచనలు అందాయి. మిల్ఖా.. చేతక్.. గౌరి.. వీర్.. భైరవ్.. ఇలా రకరకాల పేర్లను ప్రజలు నమీబియా చీతాకు సూచిస్తున్నారు.