టీటీడీ చైర్మన్ గా అశోక గజపతిరాజు…!

-

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ని కీలక పదవి వరించబోతోంది.టీటీడీ చైర్మన్ పదవి రేసులో చాలామంది పేర్లు వినిపిస్తున్నా కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు అందరికంటే ముందున్నట్లు సమాచారం. విజయనగరం రాజకుటుంబం వారసుడైన అశోక్ గజపతి రాజకు ఈ పదవి కేటాయించేందుకు చంద్రబాబు ఆసక్తి కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది.అశోక్ గజపతి రాజు వివాదరహితుడు, ధార్మిక కార్యక్రమాల గురించి తెలిసిన వ్యక్తి కావడంతో ఆయన వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం ఉంది.

అశోక్‌ గజపతి రాజు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. విజయనగరం అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా,విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం ఒకసారి ఎంపీగా గెలిచారు. అశోక్ గజపతి రాజు తన తండ్రి పీవీజీ రాజు బాటలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన తొలిసారిగా 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటీ నుంచి అశోక్‌ గజపతి రాజు పార్టీలో కొనసాగుతున్నారు.1983లో టీడీపీ నుంచి పోటీ చేసిన అశోక్‌ గజపతిరాజు రెండవసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా విజయనగరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.2004లో అశోక్‌ గజపతిరాజు ఓటమి పాలవగా 2009లో తిరిగి అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా కూడా ఆయన పనిచేశారు.

2014లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు.2018లో ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చేవరకు ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగారు. 2019 ఎన్నికల్లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలో నిలిచిన ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.2024 ఎన్నికల సమయంలో ఆయన పోటీకి ఆసక్తి చూపకపోవడంతో కుమార్తె అదితి గజపతిరాజు బరిలో నిలిచి విజయం సాధించారు.పార్టీలో సీనియర్ అయిన అశోక్ గజపతిరాజు అయితే టీటీడీ చైర్మన్ పదవికి న్యాయం చేయగలరని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ కీలక పదవి దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news