బ్రేకింగ్; సాక్షిపై లోకేష్ 75 కోట్ల పరువు నష్టం…!

-

“చిన‌బాబు చిరుతిండి 25 ల‌క్ష‌లండి” పేరుతో తనపై కథనం రాసిన సాక్షిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 75 కోట్లకు పరువు నష్టం దావా వేసారు. సాక్షి దిన‌ప‌త్రిక‌లో 2019 అక్టోబ‌ర్ 22న ఈ కథనం ప్రచురించారు. అప్పుడే దీనిని తెలుగుదేశం పార్టీ వర్గాలు తీవ్రంగా ఖండించగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా తీవ్ర విమర్శలు చేసారు.

ఇప్పటికే దీనిపై లోకేష్ సాక్షి పత్రికకు నోటీసులు కూడా పంపించారు. కథనంలో ప్రచురించిన అంశాలన్నీ పూర్తిగా అవస్తావాలు అని, దురుద్దేశపూర్వకంగా రాసిన త‌ప్పుడు క‌థ‌నం అని ఖండిస్తూ 2019 అక్టోబ‌ర్ 25న సాక్షి సంపాద‌క‌బృందానికి నారా లోకేశ్ త‌ర‌ఫున న్యాయ‌వాదులు రిజిస్ట‌ర్ నోటీసు జారి చేసారు. దీనికి సాక్షి నుంచి సమాధానం వచ్చింది. దానితో సంతృప్తి చెందని లోకేష్, పరువు నష్టం దావా వేసారు.

విశాఖ‌ప‌ట్నం 12వ అద‌న‌పు జిల్లా జ‌డ్జి కోర్టులో రూ.75 కోట్ల‌కు ఒరిజిన‌ల్ సూట్ 6/2020 నెంబ‌రుతో వ్యాజ్యం దాఖలు అయింది. తన వ్యక్తిగత పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే దురుద్దేశంతో సాక్షి పత్రికలో కథనం రాసారని, విశాఖ‌ప‌ట్నం విమానాశ్రయంలో తాను చిరుతిళ్లు తిన్నాన‌ని సాక్షి రాసిన తేదీల‌లో తాను ఇత‌ర ప్రాంతాల‌లో ఉన్నాన‌ని, అయినా త‌న ప‌రువుకు భంగం క‌లిగించేందుకు, రాజకీయంగా ల‌బ్ధి పొందేందుకు అస‌త్యాలతో క‌థ‌నం వేశార‌ని దావాలో ప్రస్తావించారు లోకేష్.

ఉన్న‌త విద్యావంతుడిగా, ఒక జాతీయ పార్టీకి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా ప‌నిచేసిన త‌న ప‌రువు ప్ర‌తిష్ట‌లు మంట‌క‌లిపేందుకు త‌నకు సంబంధంలేని అంశాల‌తో ముడిపెట్టి అస‌త్య‌క‌థ‌నం రాసి ప్ర‌చురించిన కార‌ణంగా తీవ్ర‌మ‌నోవేద‌న‌కు గుర‌య్యాన‌ని, దీనికి బాధ్యులైన సాక్షి సంస్థ జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్ లిమిటెడ్‌, సాక్షి ప్ర‌చుర‌ణ‌క‌ర్త మ‌రియు సంపాద‌కుడైన వ‌ర్థెల్లి ముర‌ళి, విశాఖ‌ప‌ట్నంకి చెందిన సాక్షి న్యూస్ రిపోర్ట‌ర్లు బి వెంక‌ట‌రెడ్డి, గ‌రిక‌పాటి ఉమాకాంత్‌లపై రూ.75 కోట్ల‌కు దావా వేసారు లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news