పల్లా-ముత్తిరెడ్డి పంచాయితీ..ఇంకా తెగేలా ఉంది.!

-

జనగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి,  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిల మధ్య పంచాయితీ ఇంకా పెద్దది అవుతుందే తప్ప తగ్గడం లేదు. జనగామ సీటు విషయంలో ఇద్దరి మధ్య పోరు నడుస్తోంది. ఇటీవల సి‌ఎం కే‌సిఆర్ 119 స్థానాలకు గాను 115 స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు చేసిన విషయం తెలిసిందే. నాలుగు సీట్లని పెండింగ్ లో పెట్టారు. జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లి సీట్లు పెండింగ్ లో ఉన్నాయి.

అయితే జనగామ సీటు విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని తప్పించి పల్లాకు సీటు ఇస్తారనే చర్చ ఎప్పటినుంచో జరుగుతుంది. వాస్తవానికి లిస్ట్ లో జనగామ కూడా రావాలి. కానీ ముత్తిరెడ్డి సీటు కోసం గట్టిగా పోరాడుతున్నారు. దీంతో ఆ సీటు పెండింగ్ లో పడింది. జనగామ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తిరెడ్డి..ఈ సారి కూడా పోటీ చేయాలని చూస్తున్నారు. కానీ ఆయనపై వ్యతిరేకత కనిపిస్తుంది. అటు కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. సొంత కుమార్తె వ్యతిరేకంగా మారిన విషయం పెద్ద రచ్చగా మారింది.

అయితే ఇవన్నీ పల్లా కావాలని చేశారని, తనని దెబ్బతీయడానికే చేశారని ముత్తిరెడ్డి ఆరోపిస్తున్నారు. తాను భూ కబ్జాలు చేశానని నిరూపిస్తే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమని అంటున్నారు. డబ్బులతో పల్లా అందరినీ కొంటున్నారని, అసలు పల్లాకు జనగామలో ఏం పని అని నిలదీస్తున్నారు.

ఇలా పల్లాకు దాదాపు సీటు రాకుండా అడ్డుకునేందుకు ముత్తిరెడ్డి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ కే‌సి‌ఆర్ ఇంకా సీటు తేల్చడం లేదు. ఈ లోపు పంచాయితీ పెద్దది అయ్యేలా ఉంది. ఒకవేళ ముత్తిరెడ్డికి మళ్ళీ సీటు ఇస్తే పల్లా బి‌ఆర్‌ఎస్‌ని వదలడం జరిగే పని కాదు..కానీ పల్లాకు సీటు ఇస్తే ముత్తిరెడ్డి అంశమే డౌట్. చూడాలి మరి చివరికి జనగామ సీటు ఎటు తేలుస్తారో?

Read more RELATED
Recommended to you

Latest news