పవన్ టైమింగ్..మోదీని కీర్తిస్తూ..ఏం చెప్పాలని..!

-

ఇటీవల ప్రధాని మోదీ పర్యటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణల్లో మోదీ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించారు. అయితే తెలంగాణలో పూర్తిగా కే‌సి‌ఆర్ ప్రభుత్వం  టార్గెట్ గా మోదీ విమర్శలు చేశారు. కానీ ఏపీలో అలా చేయలేదు. ఓ వైపు జగన్‌తో సఖ్యతగానే ఉంటూ, మరో వైపు పవన్‌తో మోదీ అవ్వడం సంచలనమైంది. మొదట మోదీతో పవన్ భేటీ అయ్యారు. ఆ భేటీలో ఏం జరిగిందో ఎవరికి  తెలియదు, కానీ ఎవరికి వారు ఏం జరిగిందో ఊహించుకుని కథనాలు రాశారు.

అలా అని పవన్ సైతం భేటీ వివరాలు ప్రెస్ కు పూర్తిగా చెప్పలేదు. రాష్ట్ర పరిస్తితులని మోదీకి చెప్పానని, ఆయన రాష్ట్ర అభివృద్ది కోసం కృషి చేస్తానని చెప్పారని అన్నారు. అంతే ఇంకా మోదీ తర్వాత విశాఖలో కార్యక్రమాలు చూసుకుని తెలంగాణకు వెళ్లారు. ఇటు పవన్ విశాఖలోనే ఉంటూ విజయనగరం వెళ్ళి, అక్కడ జగనన్న కాలనీల్లో జరిగిన అక్రమాలు బయటపెట్టే కార్యక్రమం చేశారు.

ఆ తర్వాత పవన్ హైదరాబాద్‌కు వచ్చేశారు. ఈ క్రమంలోనే ట్విట్టర్‌లో మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. మీటింగ్ ఎప్పుడో జరిగింది..పోనీ మోదీ పుట్టిన రోజు కూడా కాదు..కానీ మోదీని కీర్తిస్తూ ట్వీట్ పెట్టారు.

“క్లిష్ట సమయంలో పాలన చేపట్టి- ప్రాంతీయవాదాలు, సాంస్కృతిక వైరుధ్యాలు.. అన్నింటినీ అర్థం చేసుకొని ఆదరించి ప్రతి ఒక్కరిలో భారతీయులం అనే భావన నింపారన్నారు. ప్రజారోగ్యానికి వాటిల్లిన విపత్తు, దేశ భద్రతకు పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణకు అహరహం తపించారన్నారు. ‘‘ప్రతి కఠిన పరిస్థితినీ ఉక్కు సంకల్పంతో ఎదుర్కొనే నాయకత్వ పటిమగల పురోగమనశీలి నరేంద్ర మోదీ గారు. ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద.. అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ’- శేషేంద్ర చెప్పిన ఈ కవితా పంక్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రస్థానానికి అద్దంపడతాయి’’ అని పవన్ పేర్కొన్నారు.

మొత్తానికి మోదీని ఓ రేంజ్‌లో పొగిడారని చెప్పొచ్చు..అంటే మూడు రోజుల క్రితం అయిన భేటీని గురించి చెబుతూ, ఇలా పొగిడారా? లేక ఈ పొగడ్త వెనుక ఏదైనా కారణం ఉందా? అనేది క్లారిటీ లేదు. మొత్తానికి పవన్ ట్వీట్‌పై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news