టీడీపీకి రాయపాటి గుడ్ బై.. చంద్రబాబు ఫోటో నెలకేసికొట్టిన రంగబాబు

-

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఫలితంగా ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా చంద్రబాబు బుద్ధి తెలుసుకుని పార్టీ నుంచి బయటికి వచ్చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజీనామా చేయగా ఇప్పుడు పక్కనే వున్న గుంటూరు నుంచి ఆ పార్టీకి షాక్ తగిలింది. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశాన్ని నమ్ముకున్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్ట్‌తో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపారు. ప్రస్తుత పరిస్ధితుల్లో టీడీపీలో పనిచేయలేనని రంగారావు పేర్కొన్నారు.

రాజీనామా చేసిన అనంతరం రాయపాటి మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు ఫోటోను నెలకేసి కొట్టి తన ఆవేదనను చెప్పుకొచ్చారు. టీడీపీ ఓ దిక్కుమాలిన పార్టీ అని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని ఆరోపించారు. తన దగ్గర రూ.150 కోట్లు తీసుకుని ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారని రంగారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన వంటి ప్రత్యేక పరిస్ధితుల్లో తన తండ్రి పోటీ చేయాల్సి వచ్చిందని చెప్తూ కులం పేరుతో పార్టీలో ఆధిపత్యం కొనసాగుతోందన్నారు. ఎన్నికలు రావడంతో చంద్రబాబు, లోకేష్‌లు ఇద్దరూ నాయకుల వద్ద డబ్బు వసూళ్ల కార్యక్రమం చేస్తున్నారని రంగారావు ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీలో ఉండటం వలన తాను తన కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని, వైసీపీ ఆహ్వానిస్తే ఏ బాధ్యత ఇచ్చినా పనిచేస్తానని ఆయన వెల్లడించారు. మంగళగిరిలో నారా లోకేష్ ఎలా గెలుస్తారో చూస్తానని రంగారావు సవాల్ విసిరారు. గుంటూరు, పల్నాడు ప్రాంతాల్లో తమ కుటుంబానికి మంచి పేరు వుందని తనకు ఎక్కడి నుంచి అవకాశం ఇచ్చినా పోటీ చేస్తానని వెల్లడించారు. కియా కంపెనీని తానే తీసుకొచ్చానని చంద్రబాబు చెప్పుకుంటున్నారని మరి రాయలసీమలో టీడీపీ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. తాను సత్తెనపల్లి సీటును ఆశించానని, కానీ ఆ సీటును కన్నా లక్ష్మీనారాయణకు ఇస్తున్నట్లుగా కనీసం తమకు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు.చంద్రబాబు వైఖరి ఇంతేనని పార్టీలోని వర్గాలు కూడా గుసగుసలాడుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news