రివర్స్‌ టెండరింగ్‌ ఆ విషయంలో బోల్తా కొట్టిందా

-

రివర్స్‌ టెండరింగ్‌. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పదం బాగా పాపులర్‌ అయింది. ప్రజాధనం ఆదా చేయడమే రివర్స్‌ టెండరింగ్‌ ఉద్దేశం. కానీ.. రివర్స్‌ టెండరింగ్‌ అమలు చేసే విషయంలో ఎక్కడో లాజిక్కు మిస్‌ అవుతున్నాయట ఆయ శాఖలు. దీనిపైనే ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై రివర్స్‌ టెండరింగ్‌ అమలు చేశారు. తర్వాత కాలంలో ఈ విధానాన్ని అన్ని ప్రభుత్వ విభాగాలకు విస్తరించారు పాలకులు. ఈ సందర్భంగా తీసుకుంటున్న చర్యలు.. కొందరు అధికారుల అత్యుత్సాహం రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్నే నవ్వులు పాలు చేస్తోందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. సీఎం జగన్‌ దగ్గర, ప్రభుత్వం దగ్గర మార్కులు కొట్టేయాలనే ఉద్దేశంతో విచిత్రమైన లెక్కలు చెబుతున్నారట అధికారులు. ఈ అంశంపై ప్రస్తుతం ఎక్సైజ్‌ శాఖలో ఆసక్తికర చర్చ జరుగుతున్నట్టు సమాచారం.

మద్యం దుకాణాల అద్దెల విషయంలో రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేసింది ఎక్సైజ్‌ శాఖ. రెంట్లపై దాదాపు 108 కోట్లు ఆదా చేసినట్టు స్వయంగా డిప్యూటీ సీఎం ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణ స్వామి ప్రకటించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అద్దెలను చాలా వరకు తగ్గించామని వెల్లడించారాయన. మంత్రి ప్రకటన వరకు బాగానే ఉన్నా.. ఇక్కడో లాజిక్కు మిస్‌ అయ్యారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

2019-20లో మద్యం షాపులకు 671.04 కోట్లు అద్దెల రూపంలో చెల్లిస్తే.. వచ్చే ఏడాది రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా కేవలం 562.2 కోట్లు అద్దెగా చెల్లించనున్నట్టు ప్రభుత్వ ప్రకటనలో ఉంది. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా 16.22 శాతం ప్రభుత్వ నిధులను ఆదా చేశామని చెప్పుకొచ్చారు. ఇక్కడే లాజిక్కు తీస్తున్నాయి కొన్ని ప్రభుత్వ వర్గాలు. ఎలాగూ షాపులు తగ్గుతాయి. ఆ విధంగా అద్దెల భారం తగ్గుతుంది. అయినప్పటికీ రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా తగ్గించామని చెప్పడం ఎంత వరకు కరెక్ట్‌ అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.

ఒక్కో షాపు ఒక్కో చోట ఉంటుంది.. వాటిని గంపగుత్తగా రివర్స్‌ టెండరింగ్‌ పిలవడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. ఏదో కొన్ని షాపుల్లో బేరమాడి.. దానికి రివర్స్‌ టెండరింగ్‌ అనే పేరు పెట్టేసి గొప్పగా చెప్పుకొంటున్నారనే విమర్శలు ఉన్నాయి. మరి.. దీనికి ఎక్సైజ్‌ అధికారులు ఏం సమాధానం చెబుతారో మరి..

Read more RELATED
Recommended to you

Latest news