14400 కాల్ సెంట‌ర్‌కు టీడీపీ నేత ఫోన్‌… జ‌గ‌న్‌పై కంప్లైంట్‌

-

ఏపీలో ఎక్క‌డ అవినీతి జ‌రిగినా ఫిర్యాదు చేసేందుకు ఏపీ ప్రభుత్వం 14400 నంబరుతో ఏర్పాటు చేసిన కాల్‌సెంట‌ర్‌కు టీడీపీ నేత ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి వ‌రుస‌గా పాల‌న‌లో ఒక్కో అంశాన్ని సంస్క‌రించుకుంటూ వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ప్రజలు అవినీతికి సంబంధించిన ఈ కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయొచ్చని ఏపీ సీఎం జగన్ తెలిపారు.

అయితే ఈ కాల్ సెంట‌ర్‌కు ఏపీ టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య కాల్ చేసి సీఎం జ‌గ‌న్ అవినీతిపై కంప్లెంట్ చేయ‌డం గ‌మ‌నార్హం. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని జగన్ వేల కోట్లు సంపాదించారని వర్ల రామయ్య కాల్ సెంటర్ ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. పైగా అక్క‌డితో ఆగ‌ని వ‌ర్ల త‌న ఫిర్యాదును స‌చివాల‌యానికి తీసుకువెళ్లి అక్క‌డ ఎవ‌రైనా అధికారుల‌కు కూడా ఇవ్వాల‌న్నారు.

సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించిన‌ట్టుగా తాను ఇచ్చిన ఫిర్యాదుపై 15 రోజుల్లో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడా ఆయ‌న డిమాండ్ చేశారు. రూ. 43 వేల కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు అభియోగాలు పెట్టుకుని అవినీతిని అంతమొందిస్తా అని జగన్ ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. వ‌ర్ల రామ‌య్య స్వ‌యంగా సీఎంపై ఫిర్యాదు చేయ‌డంతో కాల్ సెంట‌ర్ సిబ్బంది అవాక్క‌య్యారు.

వ‌ర్ల ఫిర్యాదుపై వైసీపీ నేత‌ల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అస‌లు కోర్టుల్లో విచార‌ణ జ‌రుగుతున్న కేసుల గురించి వ‌ర్ల ఎలా మాట్లాడ‌తారని ? ఎలా ఫిర్యాదు చేస్తార‌ని.. ఆయ‌న కేవ‌లం ప్ర‌చారం కోస‌మే ఈ నాట‌కాలు ఆడుతున్నారంటూ వారు విమ‌ర్శిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news